astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

ఈ స‌మ‌యంలో చేయాల్సిన ప‌ని..!

ఆశ్వ‌యుజ మాసం రానే వ‌చ్చింది. శ‌ర‌న్న‌వ‌రాత్రులు మొద‌ల‌య్యాయి. అమ్మ‌వారి ఆల‌యాల్లో విశేష పూజ‌లు నిర్వ‌హించే స‌మ‌యం ఇది. వీలు కొల‌దీ దేవాల‌యంలో కానీ, ఇంటి ద‌గ్గ‌ర కానీ, మందిరంలో కానీ అమ్మ వారి పూజ చేసుకొంటే మంచిది. సాధ్యం అయితే స‌మూహంతో లేదా ఇంటిల్లి పాది క‌లిసి లేదా ఒంట‌రిగా అయినా ఈ పూజ చేసుకోవ‌చ్చు. ఈ పూజ‌లో నిబంధ‌న‌ల క‌న్నా భ‌క్తికి ప్రాధాన్యం అని గుర్తించుకోవాలి.

అమ్మ వారి అర్చ‌న కు ఉద‌యం కానీ, సాయంత్రం కానీ విశేష స‌మ‌యం. శుచిగా స్నానం ఆచ‌రించి అమ్మ‌వారి ఆరాధ‌న‌కు సంక‌ల్పించాలి. అమ్మ వారికి షోడ‌శ ఉప‌చారాలు స‌మ‌ర్పించి పూజ చేసుకోవ‌చ్చు. శ్రీ సూక్త విధానంగానూ పూజ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత అమ్మ వారికి కుంకుమార్చ‌న చేస్తే మేలు. ల‌లితా స‌హ‌స్రం కానీ, త్రిశ‌తి కానీ, ఖ‌డ్గ‌మాల కానీ జ‌పిస్తూ అమ్మ‌వారికి కుంకుమార్చ‌న జ‌రిపిస్తే మంచిది. ఆ త‌ర్వాత అమ్మ కు ప్రీతిగా నైవేద్యాలు స‌మ‌ర్పించి ప్ర‌సాదం పంచాలి. అమ్మ వారి ఆరాధ‌న‌తో అన్నీ స‌మ‌కూరుతాయ‌న్న‌ది భ‌క్తుల న‌మ్మిక‌. ఏడాది పొడ‌వునా చేసిన అర్చ‌న ఒక ఎత్త‌యితే, ఈ న‌వ‌రాత్రుల్లో చేసిన అర్చన ఒక ఎత్తు. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఈ అర్చ‌న చేయ‌టం మంచిది.

మొక్క‌లు పెంచ‌టం మంచిది కాదా..!


మొక్క‌లు పెంచ‌టం మంచిది కాద‌ని ఎవ‌రైనా చెబితే దాన్ని న‌మ్మ‌వ‌ద్దు. మొక్క‌ల్ని పెంచ‌టం, చెట్లు పెట్ట‌డం అన్న‌ది హైంద‌వ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని అల‌వాటుగా చేసుకొనేందుకు ఒక్కో న‌క్ష‌త్రానికి ఒక్కో మొక్క‌ను సూచించ‌టం జ‌రిగింది. క‌నీసం దీని కార‌ణంగా అయినా ప్ర‌తీ మ‌నిషి ఒక చెట్టును పెంచుతార‌ని భావ‌న‌. అంత అంత‌రార్థంతో చెట్లు పెంచ‌టాన్ని ప్రోత్స‌హించిన సంస్కృతి మ‌న‌ది.

విష్ణుమూర్తి తుల‌సీ ద‌ళం రూపంలో శోభిల్లుతాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ఈ  మొక్క‌లు ఎంతో ఔష‌ధ గుణాలు క‌ల్గి ఉన్నాయి. అటువంటి విలువైన మొక్క‌ల్ని పెంచ‌టం, ఆయా ఆకుల్ని ఉప‌యోగించ‌టం వ‌ల‌న ఔష‌ధ గుణాలు ల‌భిస్తాయి. అందుచేత ఇటువంటి మొక్క‌లు, ప‌త్రాల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌టం జ‌రిగింది. అదే స‌మ‌యంలో ప‌త్తి  వంటి మొక్క‌ల్ని పెంచ‌టం మంచిది కాదంటారు. దీనికి కార‌ణం ఏమిటంటే ప‌త్తి నుంచి వ‌చ్చే దూది ఎగిరి క‌ళ్ల‌కు ఇబ్బంది క‌ల్గిస్తుంది కాబ‌ట్టి ఆ ర‌కంగా చెబుతారు త‌ప్పితే మొక్క‌ల పెంచ‌టం స‌రైన చ‌ర్యే అని గుర్తుంచుకోవాలి.

ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు గ‌మ‌నించాల్సిన‌వి..!


ఏ పూజ చేసినా మొద‌ట‌గా కొల‌వాల్సింది గ‌ణ‌ప‌తినే. అటువంటి గ‌ణ‌ప‌తి పూజ‌లో శ్ర‌ద్ద ముఖ్యం. గ‌ణ‌ప‌తి కి ప‌త్రి అంటే చాలా ఇష్టం. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌త్రి తో పూజించ‌టం మేలు. అందునా గ‌రిక అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అందుచేత గ‌రిక తో పూజించేందుకు ప్ర‌య‌త్నించాలి. 21 సార్లు గ‌రిక‌తో పూజిస్తే గ‌ణ నాధుడు ఎంతో సంతోషిస్తాడు. క‌నీసం 5 సార్లు అయినా పూజిస్తే మేలు. లేదంటే అక్షిత‌ల‌తో పూజించుకోవ‌చ్చు. అయితే అక్షిత‌లు క‌ల‌ప‌టంలో ప‌సుపు ను నీటితో క‌న్నా ఆవునేతితో క‌లిపితే మంచిద‌న్న మాట ఉంది. ఏమైనా షోడ‌శ ఉప‌చారాల‌తో గ‌ణ నాధుడ్ని పూజించి ఆ త‌ర్వాత ఏ కార్య‌క్ర‌మ‌మైనా సంక‌ల్పిస్తే శుభం క‌లుగుతుంది.

పసుపు తో వినాయ‌కుడి ప్రాధాన్యం ఏమిటి..!

ప‌సుపు తో వినాయ‌కుడ్ని త‌యారుచేసుకొని పూజ చేసుకొంటుంటాం. కేవ‌లం వినాయ‌కుడ్నే ఈ రూపంలో పూజ చేసుకొంటాం. ప్ర‌తీ పూజ‌కు, శుభ కార్యాల‌కు ముందు గ‌ణ‌పతి పూజ త‌ప్ప‌నిస‌రి. ఆఖ‌రికి వినాయ‌క వ్ర‌తం చేసే ముందు కూడా ప‌సుపుతో చేసిన గ‌ణ‌ప‌తికి అర్చించుకొంటాం. విఘ్నాలు ఏర్ప‌డ‌కుండా ఉండాల‌ని, త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకొంటూ ఈ ప‌సుపు వినాయ‌కుడ్ని అర్చించుకోవ‌టం ఆన‌వాయితీ.

వాస్త‌వానికి ప‌సుపు తో వినాయ‌కుడ్ని చేయ‌టంపై భిన్న క‌థ‌నాలు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన‌ది. ఆ స‌మ‌యంలో నందీశ్వ‌రుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము ప‌డిపోయిన‌ది. అది ఎక్క‌డ‌కు పోయిందో అని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గ‌లిగిన వినాయ‌కుడు వెద‌కి తెచ్చిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయ‌కుడిని ప‌సుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్య‌మైనా నెర‌వేరుతుంద‌ని వ‌రం ఇచ్చిన‌ట్లు చెబుతారు. అప్ప‌టినుంచి వినాయ‌కుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించ‌టం ఆన‌వాయితీ గా వ‌స్తోంది. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజిస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

అంద‌రికీ తెలిసిందే అయిన‌ప్ప‌టికీ ... ఒక కొత్త విష‌యం తెలుసుకొందాం..!


తెలిసిన విష‌యాలు చాలా ఉంటాయి కానీ అందులోని అంత‌రార్థం తెలుసుకొంటే మాత్రం వివ‌ర‌ణ పూర్తిగా తెలుస్తుంది.

నుదుట‌న కుంకుమ బొట్టు పెట్టుకొంటాం మ‌న సాంప్ర‌దాయం. దీనికి బ‌దులు ఇప్పుడు స్టిక్క‌ర్ లు పెట్టుకోవ‌టం అలవాటైంది. దీని మీద వ్యాఖ్యానించ‌ద‌ల‌చుకోలేదు. కానీ నుదుట‌న కుంకుమ పెట్టుకోవ‌టం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. నుదిటి ప్రాంతంలో నాడీ వ్య‌వ‌స్థ కు చెందిన కీల‌క నాడుల‌న్నీ ఒకే చోట పోగు ప‌డి ఉంటాయి. ఇక్క‌డ నుంచే మెద‌డుకు వెళ్లే నాడులు సాగుతుంటాయి. ఇక్క‌డ ఉండే ర‌క్త నాళాల్లో చురుగ్గా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతు ఉంటుంది. ఆ ఉధృతికి త‌గిన‌ట్లుగానే ఇక్క‌డ ఒత్తిడి ఉంటుంది. అందుచేత అక్క‌డ చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చే విధంగా బొట్టు పెట్టుకొంటే మంచిది. ఇందుకోసం పూర్వ కాలంలో అర‌టి బొట్టు పెట్టుకొనేవారు. అర‌టి బొట్టు అంటే అర‌టి చెట్టు ని కూల్చిన‌ప్పుడు కొంత మేర న‌ల్ల‌గా ఏర్ప‌డుతుంది. ఆ కాండ‌ము ను క‌త్తిరించి ఆర పెట్టిన‌ప్పుడు ఇది ఏర్ప‌డుతుంది. దీన్ని సేక‌రించి బొట్టుగా పెట్టుకొనే సాంప్ర‌దాయం ఉంది. కొన్ని చోట్ల మారేడు ద‌ళాలు ఎండ పెట్టి కాల్చి దీన్ని బొట్టుగా ధ‌రిస్తారు. క‌నీసం ప‌సుపు నుంచి త‌యారు చేసిన కుంకుమ ను బొట్టుగా పెట్టుకొన్నా చాలా మంచిదే. అందుచేత ఏ రూపంలోని బొట్టుని అయినా ధ‌రించ‌టం వ‌ల‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అంతే కాకుండా ముఖ వ‌ర్చస్సు కూడా నిండుగా ఉంటుంది. ఆడ‌వారు మాత్ర‌మే కాదు మ‌గ వారు కూడా చ‌క్క‌గా బొట్టు పెట్టుకొంటే ఆరోగ్య వంతంగా సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండ‌టానికి వీల‌వుతుంది. ఆలోచించి చూడండి..!

భాద్ర ప‌ద మాసం లో మ‌రిచిపోకూడ‌ని విష‌యం..!

భాద్ర‌ప‌ద మాసం వేగంగా గ‌డిచిపోతోంది. ఇప్ప‌టికే శుక్ల ప‌క్షం స‌గం రోజులు గ‌డ‌చిపోయాయి. నాలుగు రోజుల్లో పౌర్ణ‌మి వ‌చ్చేస్తుంది. ఈ పౌర్ణమి త‌ర్వాత వ‌చ్చే కృష్ణ ప‌క్షానికి ప్రాధాన్యం ఉంది.

మ‌నం జీవితంలో ఉన్న‌త స్థితికి చేరాల‌న్నా, చ‌క్క‌గా స్థిర ప‌డాల‌న్నా పెద్దల ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. ముఖ్యంగా పితృ దేవ‌తలు సంతృప్తి చెంది ఆశీర్వ‌దించ‌టం ముఖ్యం. అందుకే పెద్ద‌లు స్వ‌ర్గ‌స్తుల‌యిన రోజున (వ‌ర్ధంతి) గుర్తు ఉంచుకొని వారి పేరుతో ఆబ్దికం పెట్ట‌డం లేదా పుణ్య క‌ర్మ‌లు ఆచ‌రించ‌టం లేదా ప్రార్థ‌న‌లు చేయ‌టం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందుకే పెద్ద‌లు అంద‌రినీ ఒక రోజు గుర్తు చేసుకొనేందుకు మ‌హాల‌య పక్షాలు అనే ఏర్పాటు చేశారు. అంటే ఈ భాద్ర‌ప‌ద మాసంలోని కృష్ణ ప‌క్షంలో నిర్దిష్ట మైన రోజును స‌రి చూసుకొని ఈ ప‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజున ఒక పుణ్య క‌ర్మ చేసే విధంగా మ‌ల‌చుకోవ‌చ్చు. మంత్ర స‌మాప్తిగా భోజ‌నం పెట్ట వ‌చ్చు లేదా పూజ‌లు చేసుకోవ‌చ్చు. క‌నీసం నిరుపేద‌ల‌కు దానం చేయ‌వ‌చ్చు. ఆరోజు చేప‌ట్టే పుణ్య కర్మ‌లు విశేషంగా ఫ‌లిస్తాయ‌ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మ‌హాల‌య ప‌క్షాలు పాటించ‌టం మంచిది. కొంద‌రు మాత్రం ఇది ఆన‌వాయితీ లేద‌ని చెబుతుంటారు. కానీ ఇటువంటి మంచి ప‌ని మొద‌లు పెట్ట‌డ‌మే ఆన‌వాయితీ అవుతుంద‌ని గుర్తుంచుకోవాలి.

మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లిపోతోంది.. సాయంత్రం పూజ చేయ‌వ‌చ్చా..?

వినాయ‌క చ‌వితి రోజున కొంత‌మందికి వ‌చ్చిన సందేహం ఇది. ఎందుకంటే ఇవాళ మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనే చ‌వితి వెళ్లిపోతోంది. అటువంట‌ప్పుడు పూజ చేయాలా వ‌ద్దా అనే అనుమానం వెంటాడుతోంది.
వాస్త‌వానికి వినాయ‌క చ‌వితి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్త‌వానికి వేకువ జామునే నిద్ర లేచి రోజు చేసుకొనే నిత్య దేవ‌తారాధ‌న ముందు పూర్తి చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఇంటిల్లిపాది క‌లిసి పాల‌వెల్లి ని అలంక‌రించి, పూజా మందిరాన్ని అలంక‌రించుకొని పూజ‌కు సిద్ద ప‌డాలి. పూజ కోసం వినాయ‌క ప్ర‌తిమ‌ను తెచ్చి పెట్టుకోవ‌టం ఆన‌వాయితీ. ఆ త‌ర్వాత వినాయ‌కుడికి పూజ చేసి నైవేద్యాలు చెల్లించ‌టం ఆన‌వాయితీ. గ‌ణ‌ప‌తి పూజ‌లో ప‌విత్రంగా భావించే ప‌త్రి పూజ‌ను ఆచ‌రిస్తారు.

ఇంటి బ‌య‌ట ఉండే కూడ‌ళ్ల లో, సంస్థ ల్లో, కంపెనీల్లో వినాయ‌కుడ్ని నిలిపి పూజ‌లు చేయ‌టం ఆన‌వాయితీ. సాధార‌ణంగా ఎవ‌రికి వారు ఇళ్ల ద‌గ్గ‌ర పూజ‌లు చేసుకొని విధుల‌కు హాజ‌ర‌య్యాక‌, మ‌ధ్యాహ్న స‌మ‌యంలో లేదా సాయంత్రం స‌మ‌యంలో ఈ సామూహిక పూజ‌లు చేస్తారు. ఈ సారి మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లి పోతోంది కాబ‌ట్టి ఎలా అనే సందేహం వ్య‌క్తం అయింది. వాస్త‌వానికి ప్ర‌తీ రోజూ తిథి పూర్తిగా ఉండ‌టం జ‌ర‌గ‌క పోవ‌చ్చు. అటువంట‌ప్పుడు సూర్యోదయ స‌మ‌యంలో ఉన్న తిథినే ఆ రోజు తిథిగా భావిస్తారు. అందుచేత సూర్యోద‌య స‌మ‌యంలో ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఆ రోజుకి సంబంధించిన కార్య‌క‌లాపాలు నిర్ణ‌యించుకొంటారు. అందుచేత ఈ ప్రాతిప‌దిక‌నే ఇవాళ వినాయ‌క చ‌వితి పాటించ‌టం జ‌రుగుతోంది.అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజించి గ‌ణేశుడి ఆశీస్సులు అందుకోవ‌టం ఆన‌వాయితీ.

వినాయ‌క వ్రతంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశం.. వీలుంటే పాటించి చూడండి..!

వినాయ‌క వ్రతం రెండు రోజుల్లో రానుంది. ఇప్పటికే వ‌రుస శెల‌వులు ఉండ‌టంతో ఏర్పాట్లకు స‌మ‌యం చిక్కింది. ముఖ్యంగా వినాయ‌క వ్రతంలో ప‌త్రిపూజ విశిష్టమైన‌ది. ఈ ప‌త్రి పూజ లో 21 ర‌కాల ప‌త్రులు ఉప‌యోగిస్తారు. ఈ ప‌త్రుల‌ను ఈ రెండు రోజుల్లో సేక‌రించుకొనేందుకు ప్రయ‌త్నిస్తే ఫ‌లితం ఉంటుంది. కానీ సంస్కృతంలో ఉండే ఈ ప‌త్రుల పేర్లు మ‌న‌కు తెలీదే అనుకోవ‌చ్చు. కానీ ఈ ప‌త్రుల పేర్లు తెలుసుకొంటే వీటిని సేక‌రించుకొనేందుకు వీల‌వుతుంది.

బృహ‌తీ ప‌త్రం అంటే వాకుడు ఆకు. ఇది రోడ్ల ప‌క్క లో ఉండే గుబురుగా ఉండే చెట్లు. వాకుడు కాయ‌లు కూడా ప‌చ్చడి పెట్టుకొంటారు. ఈ ప‌త్రాలు లేదా కాయలు శ్వాస‌కోశ వ్యాధుల‌కు విరుగుడుగా ప‌ని చే్స్తాయి. మాచీ ప‌త్రం అంటే ద‌వ‌నం. ద‌వ‌నం ఆకు సువాస‌న ఇస్తుంది. ఆరోగ్యక‌ర‌మైన తేజ‌స్సును స‌మ‌కూర్చును. ఒత్తిడి ని త‌గ్గించేందుకు ద‌వ‌నం ఆకులు న‌మ‌ల‌టం ఉప‌యోగిస్తుంది. ఈ ద‌వ‌నం ఆకులు ఉల్లాసాన్ని క‌లిగిస్తాయి. బిళ్వ ప‌త్రం అంటే మారేడు ఆకులు. మారేడు ఆకు అంటే ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టం. ప‌ర‌మేశ్వరునికి బిళ్వ ప‌త్రి తో పూజ చేస్తే ఎంతో శ్రేష్టం. అందుచేత బిళ్వ ద‌ళాల‌తో వినాయ‌కుడ్ని పూజించినా అంతే మేలు. మారేడు కాయ కూడా రుచిక‌రం, శుచిక‌రం. మారేడు ప‌త్రికి ఉండే వ‌గ‌రు తో విరేచ‌నాల్ని అరిక‌ట్ట గ‌లుగుతుంది. జీర్ణ శ‌క్తిని పెంచుతుంది. దూర్వ యుగ్మం అంటే గ‌రిక‌. గ‌రిక అంటే నేరుగా వినాయ‌కుడికి చాలా చాలా ఇష్టం. ఈ గ‌రిక లో అత్యంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉంటుంది. బ‌ద‌రీ ప‌త్రం అంటే రేగు. రేగు ప‌త్రాలు చ‌ర్మ వ్యాధుల్ని దూరం చేస్తాయి. తుల‌సీ ప‌త్రం అంటే అంద‌రికీ తెలుసు. ప్రతీ ఇంట తుల‌సి ఉండాల‌ని పెద్దలు చెబుతారు. తుల‌సి జ‌లం తీసుకొంటే జీర్ణశ‌క్తి మెరుగవుతుంది. తుల‌సి శ‌రీర ఉష్ణోగ్రత‌ను నియంత్రిస్తుంది. తేజ‌స్సు క‌లిగిస్తుంది. అపామ‌ర్ల అంటే ఉత్తరేణి. శ్వాస కోశ స‌మ‌స్యల‌కు ఇది ప‌రిష్కారం చూపుతుంది. చూత ప‌త్రి అంటే మామిడి. మామిడి కి పుల్ల ద‌నం ర‌క్తాన్ని శుభ్ర ప‌రుస్తుంది. దుర్వాస‌న లేకుండా చేస్తుంది. జాజిప‌త్రి అంటే అంద‌ర‌కీ తెలిసిందే. ఇది చ‌ర్మ రోగాల్ని నియంత్రిస్తుంది. గండ‌క అంటే అడ‌వి మొల్ల, అశ్వథ ప‌త్రం అంటే రావి, అర్జున ప‌త్రం అంటే మ‌ద్ది, అర్క ప‌త్రం అంటే జిల్లేడు, విష్ణు క్రాంత అంటే పొద్దు తిరుగుడు, దాడిమి అంటే దానిమ్మ, సింధువాకం అంటే వావిలాకు, క‌ల‌వీర అంటే గ‌న్నేరు అని అర్థం.
కాస్తంత ఓపిక చేసుకొంటే ఈ ప‌త్రాల్ని సేక‌రించుకొనేందుకు వీలు క‌లుగుతుంది. ఈ ప‌త్రాల్ని తెచ్చుకొంటే వినాయ‌క స్వామికి ఎంతో ఇష్టం గా పూజ చేసుకోవ‌చ్చు.

అవాంత‌రాలు తొల‌గిపోవాలంటే..కాస్త ఆగి, ఈ ప‌ని చేసి చూడండి..!

అవాంత‌రాలు ఏర్ప‌డితే ఏ ప‌ని అయినా ఆగిపోతుంది. విఘ్నాలు ఏర్ప‌డితే ఏ కార్య‌మూ ముందుకు న‌డ‌వ‌దు.
ఇప్పుడు భాద్ర‌ప‌ద మాసం వ‌చ్చేసింది. నాలుగు రోజుల్లో వినాయ‌క చ‌వితి వ‌చ్చేస్తోంది. వినాయ‌క స్వామిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొల‌వ‌టం మ‌రిచిపోకండి.

**ప్ర‌స‌న్న వ‌ద‌నం ధ్యాయేత్‌, స‌ర్వ విఘ్నోప‌శాంత‌యే** అని చెబుతారు. వినాయ‌కుడ్ని కొలిస్తే విఘ్నములు తొల‌గిపోతాయ‌న్న‌ది న‌మ్మిక. అందుకే వినాయ‌క చ‌వితి రోజు మ‌రిచిపోకుండా ఈ వ్ర‌తాన్ని ఆచ‌రించాలి. ఉద‌య‌మే నిద్ర లేచి ఒక్క‌సారి వినాయ‌కుడ్ని మ‌న‌సులో ధ్యానించండి . త‌ర్వాత శుచిగా స్నానం చేసి మ‌ట్టితో గ‌ణ నాథుడి ప్ర‌తిమ త‌యారుచేసుకోండి. ఇంటిల్లి పాదిని క‌లుపుకొని పూజా మందిరంలో పూజ‌ను ఆచ‌రించండి. షోడశోప‌చారముల‌తో పూజించ‌టం ఆన‌వాయితీ. షోడ‌శ అంటే 16 ర‌క‌ములైన ఉప‌చార‌ములు చేయ‌టం అన్న మాట‌. ధ్యానావ‌హ‌నాది ఉప‌చార‌ములు చేసి ప‌త్రితో పూజించాలి. ఏక వింశ‌తి ప‌త్రాలు అంటే 21 ర‌కాల ప‌త్రుల్ని వీలైతే సేక‌రించుకొని, లేదంటే కొన్ని ర‌కాల ప‌త్రుల‌తో అయినా స్వామిని పూజ చేయాలి. చ‌క్క‌గా క‌థ చెప్పుకొని విని ప్ర‌సాదాన్ని పంచి తాము కూడా తీసుకోవాలి. వినాయ‌క చ‌వితి రోజు పుస్త‌కాలు అక్క‌డ పెట్టి పూజించ‌టం ఆన‌వాయితీ. చ‌దువు బాగా రావాల‌ని కోరుకొంటూ పిల్ల‌ల చేత ఈ పూజ చేయంచ‌టం మ‌ర‌వ‌కండి. చక్క‌గా ఈ పూజ చేసుకొంటే అవాంత‌రాలు తొల‌గ‌టం ఖాయం.
వీలు కుదిరితే ఈ ప‌ని చేసి చూడండి..!
ప్ర‌తీ రోజూ దేవ‌తారాధ‌న మంచిది అని చెప్పుకొన్నాం క‌దా.. కొన్ని సార్లు ఇది అమ‌లు చేసుకోలేని ప‌రిస్థితి. అటువంటప్పుడు వారంలో ఒక రోజైన కాస్సేపు పూజ కు కేటాయిద్దాం. ఇవాళ ఆదివారం నాడు కాస్తంత పూజాదికాలు చేసుకొన్న వారికి అభినంద‌న‌లు. పూజ త‌ర్వాత మ‌న ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు చ‌క్క‌గా ఉంటాయి. కుటుంబ స‌భ్యుల‌తో అనుబంధాలు కూడా బాగా వ‌ర్థిల్లుతాయి. అటువంట‌ప్పుడు ఈ బంధాల్ని వృద్ధి చేసుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తే మంచిది. ఒక వేళ ఈ ఆదివారాన్ని ఉప‌యోగించుకోలేక పోయారా... ఏమీ ప‌ర్వాలేదు. రేప‌టి రోజు ఉండ‌నే ఉంది.

 సోమ‌వారం, అందునా శ్రావ‌ణ సోమ‌వారం. ప‌ర‌మేశ్వ‌రునికి ఎంతో ఇష్ట‌మైన రోజు. దీన్ని స‌ద్వినియోగం చేసుకొందాం.. ఉద‌యం ఆరు గం. నుంచి 7గం. దాకా చంద్ర హోర ఉంటుంది. వీలైతే ఈ స‌మ‌యంలో పర‌మేశ్వ‌రుడ్ని ఆరాధించేందుకు ప్ర‌య‌త్నించండి. క‌నీసం **ఓం న‌మ‌శ్శివాయ‌** అనే మంత్రాన్ని ప‌ఠించేందుకు ప్ర‌య‌త్నించండి. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు జ‌పించండి. మంచి ఫ‌లితాన్ని ఆస్వాదించండి.
అంతే కాదండోయ్‌.. ప్ర‌తీ మాసంలోనూ చివ‌రి రోజున అమావాస్య వ‌స్తుంది. దీని ముందు రోజు చ‌తుర్ద‌శి ఉంటుంది. దీన్ని మామూలు తిథిగా భావిస్తాం. కానీ, దీన్ని మాస శివ‌రాత్రి అని అంటారు. ప‌ర‌మేశ్వ‌రుడికి ఎంతో ఇష్ట‌మైన రోజు ఇది. ఈ మాస శివ‌రాత్రి రోజున వీలైతే శివాల‌యానికి వెళ్లిరండి. ఒక మంచి ప‌ని చేసిన వార‌వుతారు. లేదంటే ఇంటి ద‌గ్గ‌రే కాస్సేపు ప‌ర‌మేశ్వ‌రుడ్ని ధ్యానించండి...

ఆదివారం నాడు ఈ ప‌ని చేసి చూడండి..!

ఆదివారం అంటేనే ఒక ఆట‌విడుపు. చిన్న‌ప్పుడు స్కూల్ కు వెళ్లేట‌ప్పటి నుంచి కాలేజీ రోజులు, క్యాంప‌స్ క‌బుర్ల‌ను దాటి ఉద్యోగ జీవితాల్లో స్థిర‌ప‌డే దాకా ఇదే కొన‌సాగుతుంది. అందుకే సాధార‌ణంగా ఆదివారం న‌గ‌ర వాసుల్లో చాలా మంది ఉద‌యం పూట నిద్ర కూడా లేవ‌రు. అందుచేత ఆదివారం అంటేనే బ‌ద్ద‌కంగా మొద‌ల‌వుతుంది. కానీ ఇదే ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొనే మార్గం కూడా ఉంది..

వాస్త‌వానికి ప్ర‌తీ రోజు కొద్ది సేపు పూజా కార్య‌క్ర‌మాల్లో గ‌డ‌ప‌టం మంచిది. ఉద‌యం కానీ, సాయంత్రం కానీ శుచియై నిశ్చ‌ల‌మైన మ‌నస్సుతో ఆరాధన చేసుకోవాలి. ఇష్ట‌మైన సూక్తాల్ని ప‌ఠించ‌వ‌చ్చు. పారాయణ చేసుకోవ‌చ్చు. ఓం న‌మ శ్శివాయ లేదా శ్రీ సాయి నాథాయ న‌మః వంటి మంత్రాన్ని ఇష్ట మైన‌న్ని సార్లు జ‌పించుకోవ‌చ్చు. లేదంటే ధ్యానం చేసుకోవ‌చ్చు. ఉద‌య‌మే కొద్ది సేపు ఈ ప‌నిచేసి చూడండి. ఆ రోజంతా ఎంతో బాగుంటుంది. వాస్త‌వానికి దైవం వెంట ఉంటే అన్నీ స‌వ్యంగా సాగుతాయి. దైవ బ‌లం గొప్ప‌త‌నమే అది.
ఇక ఆదివారం విష‌యానికి వ‌ద్దాం. ప్ర‌తీ రోజు ఉద‌యం పూట దైవారాధ‌న‌కు స‌మ‌యం వెచ్చించ‌లేని వాళ్లు కానీ, బ‌ద్ద‌కంతో ప‌నులు వాయిదా వేసే వారు కానీ ఆదివారాన్ని స‌ద్వినియోగం చేసుకొంటే మంచిది. చ‌క్కగా కొద్ది సేపు దేవ‌తారాధ‌న‌కు కాలాన్ని వెచ్చించండి. భ‌గ‌వంతునితో మ‌న మ‌నస్సుని జ‌త చేస్తే ఎన్నెన్నో జ్ఞాప‌కాల దొంత‌ర‌లు దొర్లిపోతాయి. దైవం అనుగ్రహాన్ని సంపాదించుకొనేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇందుకు మ‌నస్సు పెడితే చాలు.

హైద‌రాబాద్ లో ఏం మార్పు చోటు చేసుకొంటోంది..!

రాగ‌ల ప‌ది, ప‌దిహేను రోజుల్లో హైద‌రాబాద్ లో సంద‌డి నెల‌కొంటోంది. ఇప్ప‌టికే శ్రావ‌ణ మాసం చివ‌రికి వ‌చ్చేస్తున్నాం. భాద్ర ప‌ద మాసంలో వ‌చ్చే వినాయ‌క చ‌వితి కోసం సంద‌డి మొద‌లైంది. వినాయ‌క విగ్ర‌హాల త‌యారీ పెద్ద ఎత్తున సాగుతోంది. వినాయ‌క ప్ర‌తిమ‌లు తెచ్చుకొని వాటిని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజించుకొనేందుకు భ‌క్తులు ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే ఈ సారైన మ‌ట్టి విగ్ర‌హాల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ వంటి ర‌సాయ‌నాల‌తో చేసిన ప్ర‌తిమలు చూసేందుకు ఆక‌ర్ష‌నీయంగా ఉండ‌వ‌చ్చు గాక‌, కానీ ప‌ర్యావ‌ర‌ణ రీత్యా ఆలోచిస్తే మాత్రం మ‌ట్టి విగ్ర‌హాలు మాత్ర‌మే ఉత్తమం అని చెప్పుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మండ‌పాల నిర్వాహ‌కులు మ‌ట్టి ప్ర‌తిమ‌ల‌కు ఆర్డ‌ర్ ఇస్తే ఉభ‌య తార‌కంగా ఉంటుంది.

రేపు గ్రహ‌ణం ఉంది.. చేయ‌ద‌గిన‌వి..!

గ్రహ‌ణం అంటే ఖ‌గోళ శాస్త్రం ప్రకారం సౌర కుటుంబంలో సూర్యుడు, చంద్రుడు ఒకే రేఖ‌లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆ బింబం వెనుక‌గా మ‌రొక‌టి ఉండ‌టం అంటారు. సూర్యుడి వెన‌క్కి దాగి ఉండిపోతే దాన్ని సూర్య గ్రహ‌ణం అని, చంద్రుడు వెన‌క్కి ఉండిపోతే చంద్ర గ్రహ‌ణం అని చెబుతారు. ఈ గ్రహ‌ణం స‌మ‌యంలో వాతావ‌ర‌ణంలో పెక్కు మార్పులు చోటు చేసుకొనే అవ‌కాశం ఉంటుంది. అంటే అప్పటిదాకా ఉండే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు ఒక్క సారిగా మారిపోతాయి. అత్యంత ప్రభావం చూపే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ కొద్ది సేపు ప‌క్కకు త‌ప్పుకొంటే జ‌రిగే ప‌రిణామం ఇది. ఈ స‌మ‌యంలో ఆరోగ్య ప‌రంగా జాగ్రత్తగా ఉండాల‌ని చెబుతారు. దీన్ని మాత్రం భార‌తీయ సంప్రదాయ వాదులు ప్రభావ‌వంత‌మైన స‌మ‌యంగా భావిస్తారు. అందుకే గ్రహ‌ణం ప్రారంభం కావటానికి ముందే స్నానం చేసి ఇష్టమైన దైవాన్ని పూజించాల‌ని చెబుతారు. గ్రహ‌ణ స‌మ‌యంలో ఇష్ట దేవ‌త‌ల పారాయ‌ణం, మంత్ర జ‌పం మంచిది. వీటి వ‌ల్ల చక్కటి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు. కొంత‌మంది గ్రహ‌ణ స‌మ‌యంలో ఉప‌వాసం చేస్తారు. గ్రహ‌ణం త‌ర్వాత విడుపు స్నానం చేస్తారు. గ్రహ‌ణ స‌మ‌యంలో ఆహార ప‌దార్థాల్లో ద‌ర్భ ను వేసే సాంప్రదాయం మ‌న‌కు అంద‌ర‌కు తెలిసిన‌దే. గ్రహ‌ణాన్ని శాస్త్రీయంగా, ఆధ్యాత్మిక ప‌రంగా అర్థం చేసుకోద‌గిన‌ది.

మ‌హిళ‌లు ఈ ప‌ని చేయ‌వ‌ద్దు సుమా..!

మ‌హిళ‌లు, పురుషులు స‌మాన‌మే అయిన‌ప్పటికీ శాస్త్ర రీత్యా కొన్ని ప‌నులు చేయ‌కూడ‌ద‌ని చెబుతారు. అందులో ఇది కూడా ఒక‌టి. దీన్ని భార‌తీయ జీవ‌న విధానం రీత్యా ఆలోచించాల్సిన విష‌యం. తుల‌సీ ద‌ళాల‌ను మ‌హిళ‌లు ఎప్పుడూ కోయ‌కూడ‌దు అని చెబుతారు. ద్వాద‌శి నాడు తుల‌సీ ద‌ళాల‌ను తాక‌రాద‌న్నది శాస్త్రం. పురుషుల చేత కోయించ‌వ‌చ్చు. అయితే పురుషులు కూడా బహుళ పక్షంలోని అష్టమీ,చతుర్దశీ, అమావాస్యా తిథులలో గానీ - పౌర్ణమినాడుగానీ – ఉభయ పక్షాలలో ఏకాదశీ,ద్వాదశీ తిథులలోగానీ – ఆది,మంగళ,శుక్రవారాలలో గానీ అస్సలు కోయకూడదు.   తులసీ దళాలను ఒడిలోకి కోయకూడదు. ఆకులోకి కానీ, ఏదైనా పళ్లెంలోకి కానీ కోయాలి. తులసీ దళాలను ఒట్టి నేలమీద ఉంచకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి.

మ‌హిళా మూర్తుల‌కు తుల‌సి అర్చన శ్రేయో దాయ‌కం. ఇంట్లో తుల‌సి మొక్కను త‌ప్పకుండా పెంచుకోవాలి. ఉద‌యం స్నానం త‌ర్వాత తుల‌సి అర్చన చేయ‌టం మంచిది. సంక‌ల్పం చేసి, గోత్ర నామాలు చెప్పుకొన్నాక అమ్మ వారి ప్రతిరూపంగా తులసిని భావించి ప్రార్థించాలి. ప‌సుపు, కుంకుమ ల‌తో పూజించాలి. శ్రీ సూక్తం తో కానీ, విడిగా కానీ షోడ‌శ ఉప‌చారాలు స‌మ‌ర్పించాలి. తులసి చెట్టు ఉన్న మట్టిలోనూ, తులసి చెట్టుమీదా అధికంగా పసుపు,కుంకుమ,అక్షతలు వేయడం వలన అక్కడ ఉన్న పోషకాలు నశించి తులసిచెట్టు ఎక్కువకాలం నిలువదు. కనుక పసుపు, కుంకుమ, అక్షతలు వేయవలసి వచ్చినప్పుడు చెట్టు మొదటిలో కాక, తులసి కోట మొదటిలో వేయడం ఉత్తమం

.త‌ర్వాత తుల‌సీ దేవిని ఈ స్రోత్రంతో జ‌పించాలి.
 నమః తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
అనంత‌రం తుల‌సీ ద‌ళంలో నీరు పోసి ఆ నీరు తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ వాయు వేగ కాలంలో కొద్ది సేపు తీరిక చేసుకొంటే తుల‌సిదేవి పూజ చేసుకొని అమ్మ వారి ఆశీర్వచ‌నం తీసుకోవ‌చ్చు.

రేప‌టి ప్రాధాన్యం మీకు తెలుసా..!

రేప‌టి శుక్రవారం ఫాల్గుణ శుద్ధ చ‌తుర్థి. ఈ రోజున పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం ఆచ‌రిస్తారు. పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతానికి చాలా ప్రాధాన్యం ఉంది.

క‌లౌ చండీ గ‌ణేశా .. అని చెబుతారు. అంటే క‌లికాలంలో కోరిన కోర్కెలు తీర్చే దేవ‌త‌లుగా వినాయ‌కుడు, దుర్గా దేవి ప్రసిద్ది కెక్కారు.అంటే భ‌క్తి శ్రద్ధ ల‌తో గ‌ణేశుడ్ని అర్చిస్తే కోర్కెలు నెర‌వేరుతాయ‌న్నది న‌మ్మిక‌. త‌ల‌నొప్పి కి మందు వాడితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది. జ్వరానికి మాత్ర వేసుకొంటే జ్వరం త‌గ్గుతుంది. అన్ని మాత్రలే అయినా అందులో ఉండే కెమిక‌ల్ కాంపొనెంట్ వేరుగా ఉంటుంది కాబ‌ట్టి ఫ‌లితం వేరుగా ఉంటుంది. అలాగే గ‌ణేశుడికి పూజ‌లు అంతా చేస్తారు. కానీ సంతానం కావాల‌ని కోరుకొనే వారు మాత్రం పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేయ‌టం మంచిది. పుత్ర గ‌ణ‌ప‌తిని ధ్యానించుకొని సంక‌ల్పం చేయాలి. స్వామికి పురుష సూక్త విధానంతో కానీ, శ్లోక విధానంలో కానీ షోడశ ఉప‌చారాలు చెబుతూ పూజించాలి. స్వామికి ఇష్టమైన నివేద‌న‌లు చెల్లించ‌టం, గ‌రిక ప‌త్రి తో అష్టోత్తరం లేక స‌హ‌స్రం చేయించ‌టం మంచిది. కొంత‌మంది ఈ వ్రతం రోజున ఉప‌వాసం ఆచ‌రిస్తారు. అంటే ఉద‌యం నుంచి సాయంత్రం దాకా ఆహారం తీసుకోకుండా గ‌డుపుతారు. భ‌క్తి తో పుత్ర గ‌ణ‌ప‌తి వ్రతం చేస్తే సంతానం క‌లుగుతుంద‌న్నది భ‌క్తుల నమ్మిక‌.

గురువారానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది...!


గురు వారం అన్న పేరులోనే దీని ప్రాధాన్యం ఉంది. గురువు అంటే మార్గమును ప్రబోధించువాడు అని అర్థం. గురువు లేని విద్య ను వ్యర్థం అని చెబుతారు. అందుకే ఏ విద్య అయినా గురు ముఖంగా నేర్చుకోవాల‌ని సూచిస్తారు. ఇక గురువారానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసుకోవాలంటే ఒక విశ్లేష‌ణ ఉంది. ఈ విశ్లేష‌ణ అన్ని వారాల పేర్లకు కూడా వ‌ర్తిస్తుంది.

భార‌తీయ ధ‌ర్మం ప్రకారం ఒక రోజు అనేది సూర్యోద‌యం తో ప్రారంభం అవుతుంది. మ‌ర్నాడు ఉద‌యం సూర్యోద‌యం అయ్యే దాకా దాన్ని రోజుగా భావిస్తారు. అంతేకాని ఇంగ్లీషు లెక్క మాదిరి అర్థ రాత్రి పన్నెండు గంట‌ల‌కు రోజు మార‌టం కాద‌న్న మాట‌. అయితే సూర్యోద‌య స‌మ‌యంలో ఏ హోర న‌డుస్తోందో ఆ హోర కు ప్రాధాన్యం ఉంటుంది. అంటే గురు వారం రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో గురు హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి గురు వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో శుక్ర  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి శుక్ర వారం అని పేరు వ‌చ్చింది.త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో శ‌ని   హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి శ‌ని వారం అని పేరు వ‌చ్చింది.త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో ర‌వి  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి ర‌వి వారం లేక ఆది వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో చంద్ర హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి చంద్ర వారం లేక సోమ‌ వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో కుజ‌  హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి కుజ వారం లేక మంగ‌ళ వారం అని పేరు వ‌చ్చింది. త‌ర్వాత రోజు ఉద‌యం సూర్యోద‌య స‌మ‌యంలో బుధ   హోర న‌డుస్తూ ఉంటుంది. అందుచేత ఆ రోజుకి బుధ  వారం అని పేరు వ‌చ్చింది. ఈ విధంగా ఆయా రోజుల‌కు గ్రహాల పేరు మీదుగా పేర్లు ఏర్పడ్డాయి. దీన్నే వెనుక భావం నుంచి కూడా చెప్పవ‌చ్చు. అంటే ఆయా రోజుల పేర్లను బ‌ట్టి హోరా స‌మ‌యాల‌కు పేర్లను నిర్దేశించవ‌చ్చు. ఇదీ మ‌న స‌నాత‌న భార‌తీయ జ్యోతిష శాస్త్ర విశ్లేష‌ణ‌

శివ‌రాత్రి రోజు త‌ప్పని స‌రిగా చేయాల్సిన‌వి..!

ఆది వారం రోజు మ‌హా శివ‌రాత్రి. అంటే సాక్షాత్తు ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజే ప‌ర‌మేశ్వరుడు మ‌హా లింగ రూపంలో ఆవిర్భవించాడ‌ని చెబుతారు. అంత‌టి విశిష్టమైన రోజున ఆచ‌రించాల్సిన విధి విధానాల్ని నిగ‌మ శాస్త్రములు వివ‌రిస్తున్నాయి. ఆగ‌మం అంటే దైవిక క్రియ‌లు అని అర్థం. నిగ‌మ శాస్త్రములు అంటే మాన‌వుడు ఆచ‌రించాల్సిన విధులు అని అర్థం.

మ‌హా శివ‌రాత్రి వేకువ జామునే నిద్ర లేవటం ఉత్తమం. మాఘ మాసంలో సూర్యోద‌యానికి ముందే స్నానం ఆచరించాలి. మిగిలిన రోజుల్లో వీలు కుదిరినా, కుద‌ర‌క పోయినా క‌నీసం శివ‌రాత్రి అయినా వేకువ జామునే నిద్ర లేచి స్నానం ఆచ‌రిస్తే మేలు. సూర్యోద‌యానికి ముందు రెండు గంట‌ల పాటు బ్రాహ్మీ ముహుర్తం అని చెబుతారు. (సుమారుగా) ఈ స‌మ‌యంలో దేవ‌త‌ల‌కు ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అందుచేత ఈ స‌మ‌యంలో స్నానాదికాలు పూర్తి చేసి ఇష్ట్ దేవ‌త‌ల్ని పూజించాలి.ఈ రోజున ప‌ర‌మేశ్వరుడ్ని బిళ్వ ద‌ళాల‌తో అర్చిస్తే ఎంతో మంచిది. విభిన్న ద్రవ్యముల‌తో అభిషేకం చేయిస్తే ఎంతో మంచిది. శివుడు అభిషేక ప్రియుడు అని అంద‌ర‌కి తెలిసిన‌దే. అందుచేత ప‌ర‌మేశ్వరుడ్ని వివిధ ర‌కాల ద్రవ్యముల‌తో అభిషేకం, అర్చన చేయిస్తే ఉత్త మ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా విభూదితో అభిషేకం చెప్పుకోద‌గిన‌ది.
ఈ రోజున ఉప‌వాసం చేయ‌టం ఆన‌వాయితీ. చాలామంది రోజంతా అంటే మ‌ర్నాడు సూర్యోద‌యం దాకా ఉప‌వాసం ఉంటారు. లేని ప‌క్షంలో రెండు ర‌కాలుగా ఉప‌వాసం చేస్తారు. అంటే ప‌గ‌లంతా ఉప‌వాసం ఉండి, రాత్రి న‌క్షత్ర ద‌ర్శనం త‌ర్వాత భుజిస్తారు. దీన్ని న‌క్తం అని పిలుస్తారు. లేదంటే ప‌గ‌టి పూట ఆహారం తీసుకొని రాత్రంతా ఉప‌వాసం ఉంటారు. దీన్ని ఏక‌భుక్తం అంటారు. ఇందులో ఏ విధానం మేలు అన్నది ఎవ‌రికి వారు ఆలోచించుకోవాలి. మొత్తం ఉప‌వాసం ఉండ‌టం శ్రేయోదాయకం. పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్య స‌మ‌స్యలు వ‌చ్చే చాన్సు ఉన్నందున ద్రవాహారం లేదా ప్రసాదం లేదా పండ్లతో న‌డిపించ‌వ‌చ్చు.
ఇక‌, శివ‌రాత్రి ప్రాశ‌స్త్యం అంతా రాత్రి స‌మ‌యంలోనే ఉంటుంది. ఈ రాత్రి భ‌జ‌న‌లు, పారాయ‌ణాల‌తో జాగారం  చేస్తే ఎంతోమేలు. స‌దా శివ‌న్నామ స్మర‌ణ చేయ‌టం ఉత్తమం. అర్థ రాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం, అర్చన‌లు చేయించాలి. ఇది ఎంతో విలువైన స‌మ‌యం కాబ‌ట్టి ప‌ర‌మేశ్వరుడ్ని పూజించి ఆయ‌న కృప‌కు పాత్రుల‌వ‌దాం...

తెలంగాణ అన్నది దోశ వేయటం అన్నంత తేలిక కాదు.. అన్న కామెంట్ చేస్తున్న అల‌జ‌డి పెద్దల‌కు తెలీదా..!

తెలంగాణ మీద కేంద్ర మంత్ర వాయ‌లార్ ర‌వి అన్న కామెంట్ ఇది. దోశ వేయ‌టం అన్నంత తేలిక కాదు. అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆయ‌న చెప్పద‌లుచుకొన్న అంశం.. తెలంగాణ విష‌యం ప‌రిష్కారం క్లిష్టమైన‌ది అని చెప్పట‌మే. ఇందుకోసం ఆయ‌న అన్న కామెంట్ ఎన్నో ల‌క్షల మందిని క‌ల‌వ‌ర పరిచింది. అంటే ఒక వాక్యాన్ని పెద్ద స్థాయిలో ఉన్న వారు అన‌టం వ‌ల‌న ల‌క్షల మందిలో ఒక ర‌క‌మైన ఉద్వేగాన్ని క‌లిగించింది. ఎందుక‌ని.. అదే కేంద్ర మంత్రి తెలంగాణ సెంటిమెంట్ చాలా మందిలో బ‌లం గా ఉన్నందున‌, అటు స‌మైక్య వాదంపై సీమాంధ్ర లో వాద‌న వినిపిస్తున్నందున .. దీనిపై తేల్చటం క‌ష్టత‌రం అవుతోంది అని చెబితే ఎవ‌రికీ ఇబ్బంది క‌లిగేది కాదు. కానీ కేంద్ర మంత్రి ఒక వాక్యంలో చేసిన కామెంట్ తో పేప‌ర్లలో మొద‌టి పేజీ వార్తలు, టీవీ చానెల్స్ లో ప్రైమ్ టైమ్ డిస్కష‌న్ లు న‌డుస్తున్నాయి.
అదే మాట‌లో ఉండే మ‌హిమ‌. కొన్ని అక్షరాల్ని క‌లిపి ప‌దాలు, ప‌దాల్ని క‌లిపిన వాక్యాల్ని వాడిన‌ప్పుడు క‌లిగే ప్రభావం ఇది.

మంత్ర శాస్త్రంలో ఉండే మ‌హిమ కూడా ఇదే. మంత్రాల్ని స్వర‌యుక్తంగా శాస్త్ర బ‌ద్దంగా ఉప‌యోగిస్తే అద్భుత ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. ఎందుకంటే మంత్రాల ద్వారా వెలువ‌డే వైబ్రేష‌న్స్ శ‌క్తి మంతంగా ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నట్లు గా గ్రహాల అశుభ దృష్టి తాకుతున్నప్పుడు ప‌రిష్కారం గా మంత్ర జ‌పం చెబుతారు. అంటే ఏమిటి.. ఆ గ్రహానికి ఇష్టమైన మంత్రాన్ని అనేక సార్లు అంటే వంద‌ల‌సార్లు, వేల సార్లు జ‌పించ‌మంటారు. దీని కార‌ణంగా ఆ గ్రహానికి ప్రీతి క‌లిగి మేలు క‌లుగుతుంది. ఇష్టంలేని వాక్యాన్ని ఒక్కసారి ప‌లికితే ఎంత‌టి క‌ల‌వ‌రం క‌లిగిందో ఇందాక ఉదాహ‌ర‌ణ‌లో చూశాం. అదే ఇష్టమైన వాక్యం ప‌లికితే అంతే స్థాయిలో ఆనందం క‌లుగుతుంది. న‌చ్చిన వ్యక్తి మ‌న‌ద‌గ్గర‌కు వ‌చ్చి ఐ లైక్ యూ అని చెబితే పొంగి పోతాం. మీరు మంచి వారు, మీరు చ‌క్కటి వారు అని చెబితే సంతోషిస్తాం.అదే మాట వంద‌ల సార్లు, వేల సార్లు చెబితే ఎంత‌టి సంతోషం క‌లుగుతుంది ..
ఇక అదే మంత్రాల‌ను సుస్వర యుక్తంగా సుసంప‌న్నం చేయ‌వ‌చ్చు. ప‌దం రూపంలో, క్రమ రూపంలో, జఠ రూపంలో, ఘ‌న రూపంలో చెబితే క‌లిగే వైబ్రేష‌న్స్ అంతా ఇంతా కాదు. ఈ వైబ్రేష‌న్స్ ద్వారా చ‌క్కటి ఫ‌లితాలు క‌లుగుతాయి. అదే లాజిక్ ను జ్యోతిష శాస్త్రం అప్లయ్ చేస్తుంది. చ‌క్కటి ప‌రిష్కారాన్ని చూప‌టం ద్వారా మాన‌వ జీవితానికి జ్యోతి మాదిరిగా వెలుగు చూపేదే జ్యోతిష్ శాస్త్రం. స‌ర్వే జ‌నా సుఖినో భ‌వంతు..

క‌నీసం ఈ సోమ‌వారం అయినా ప్రయ‌త్నించండి..!

సోమ‌వారం వ‌చ్చిందంటే ఒక మంచి అనుభూతి.. ఎందుకంటే ప‌ర‌మేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు అది. మాసాల్లో కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టమైన మాసం మాఘ‌మాసం. ఈ సోమ‌వారం స‌ప్తమి తిథి తో క‌లిసి ఉన్నది కాబ‌ట్టి దేవ‌తారాధ‌న‌కు మంచి రోజు. ప‌ర‌మేశ్వరుడ్ని అర్చించుకొనేందుకు,సూర్య భ‌గ‌వానుడ్ని ఆరాధించుకొనేందుకు ఇది మంచి స‌మ‌యం. ఉద‌య‌మే లేచి ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవాలి.
కరాగ్రే వసతే లక్ష్మీః,
కర మధ్యే సరస్వతీ,
కరమూలే స్థితో బ్రహ్మా,
ప్రభాతే కర దర్శనం
                చేతి అగ్ర భాగము-ముందు లక్ష్మీ దేవివసించి యున్నది.చేతి మధ్య భాగమునందు చదువుల తల్లి సరస్వసతీ దేవివిరాజిల్లుతున్నది.చేతి మూలమునందు బ్రహ్మ దేవుడు నివసించియున్నాడు.కావున ప్రాతఃకాలమునందూ ఇట్టి దివ్యమైన భావముతో రెండు చేతులను దర్శించాలి.ఆ పిదప
సముద్ర వసనే దేవి!
పర్వతస్తన మండలే,
విష్ణు పత్ని నమస్తుభ్యం,
పాదస్పర్శం క్షమస్వమే!
సముద్రము వంటి వస్త్రములను ధరించినట్టి,పర్వత స్వరూప స్తనములతో,శ్రీ విష్ణు భగవానుని పత్నియగు ఓ పృధ్వీ దేవీ నీవు దయతో నా పాద స్పర్శను క్షమింపుము.అని భూ మాతను క్షమాపణ పూర్వకంగా ప్రార్ధించాలి. ఆత‌ర్వాత శాస్త్ర ప్రకారం స్నానం చేసి, చ‌క్కగా దేవ‌తారాధ‌న‌కు పూనుకోవాలి. ఈ రోజున ఆదిత్యుడ్ని పూజించుట మేలు. ఆదిత్య హృద‌యం పారాయణంతో ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి.

రాగి పాత్రలో గరిక, పాలు, ఎర్రచందనం, మందార పువ్వులు కలిపిన పదార్థంతో సూర్య నారాయణ స్వామికి ఎదురుగా నిలబడి ఆర్ఘ్యం ఇస్తే స్వామి సంతృప్తి చెందుతారని, భక్తులకు భోగభాగ్యాలిచ్చి వచ్చే జన్మలో ఎటువంటి రోగాలు దరిచేరకుండా దీర్ఘాయిష్సు ప్రసాదిస్తారని నమ్మకం. భక్తులు మరణానంతరం సూర్యలోకం చేరుతారని  చెబుతారు. ఆ త‌ర్వాత ప‌ర‌మేశ్వరుడ్ని మారేడు ప‌త్రాలు, పుష్పాల‌తో అర్చించుకోవాలి. ప‌ర‌మేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబ‌ట్టి మ‌న‌సా, వాచా భ‌క్తితో అభిషేకం, అర్చన చేసుకోవచ్చు. ఇటువంటి విశిష్టమైన రోజున ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. అంటే ఇది ఆరు ర‌కాలు ఉన్నప్పటికీ, ఏక‌భుక్తం మేలు. ఏకభుక్తం (ఒంటిపూట) చేస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలో ఉన్న ఉబ్బసరోగాలు, శ్వాసకు సంబంధించిన రోగాలు, నరాల వ్యాధులు నశిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. తెల్లజిల్లేడు, పందిరి చిక్కుడు ఆకులకు, రేగు పళ్లకి, సౌరశక్తిని నిలువ చేసే శక్తి ఎక్కువగా వుంటుంది. వీటిపై ఉంచిన ప్రసాదాన్ని భుజించడం వల్ల అన్ని వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే రథసప్తమి రోజున శిరస్సు మీద, భుజాలు మీద తెల్ల జిల్లేడు ఆకులు, రేగుపళ్లు పెట్టుకొని స్నానం చేయడం వల్ల దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.

రేపటి విశిష్టత మీకు తెలిసే ఉంటుంది..!

రోజుల విశిష్టత, ప్రాధాన్యం తెలుసుకొంటే భ‌లే ఆస‌క్తిగా ఉంటుంది. ముఖ్యంగా అంత‌కు ముందు తెలిసిన విష‌యాలే అయినా ఆయా రోజుల‌కు ప్రాధాన్యం ఉంటే బ‌హు చ‌క్కగా ఉంటుంది. అదే విష‌యాన్ని గుర్తుకు తెచ్చుకోవ‌టంతో పాటు ఆచ‌ర‌ణ‌లో పెట్టుకొనేందుకు వీలవుతుంది.

రేపు సోమ‌వారం అన‌గా ఫిబ్రవ‌రి 25వ తేదీన మాఘ పౌర్ణమి ఏర్పడుతోంది. కార్తీక మాసం త‌ర్వాత అంత‌టి విశిష్టత ఉన్న మాసంగా మాఘ మాసాన్ని చెబుతారు. అందుకే కార్తీక పౌర్ణమి త‌ర్వాత అంత‌టి ప్రాధాన్యం ఉన్న రోజుగా మాఘ పౌర్ణమిని వ‌ర్ణించ‌వచ్చు. మాఘ మాసంలో స్నానం, దానం ప్రత్యేకంగా చెప్పద‌గిన‌వి. అందుకే మాఘ‌పౌర్ణమి రోజున కూడా ప‌విత్ర స్నానాలు ఆచ‌రిస్తారు. ఆ రోజున వేకువ జామునే పుణ్య స్నానాలు ఆచరిస్తారు. పైగా సోమ‌వారం కూడా క‌లిసి రావ‌టంతో ప‌ర‌మేశ్వరునికి అర్చన‌లు, అభిషేకాలు చేయిస్తారు. ఉన్నంత‌లో కొంత మొత్తాన్ని దానంగా చేయ‌టం మంచిద‌ని చెబుతారు.
ఈ సారి మ‌హా కుంభ మేళా జ‌రుగుతుండ‌టంతో అల‌హాబాద్ (ప్రయాగ‌) లో పెద్ద ఎత్తున పుణ్య స్నానాలు చేయ‌బోతున్నారు. గంగ, య‌మున‌, స‌రస్వతీ న‌దుల స‌మ్మేళ‌నంలో పుణ్య స్నానం చేయ‌టం పవిత్రంగా భావిస్తారు. దాదాపుగా 80 ల‌క్షల మంది భ‌క్తులు రేప‌టి రోజుల స్నానాలు ఆచ‌రిస్తార‌ని అంచ‌నా వేస్తారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఈ సంఖ్య కాస్త త‌గ్గ వ‌చ్చని భావిస్తున్నారు. పుష్య మాస‌పు పౌర్ణమి నుంచి మాస‌పు వ్రతం ఆచరిస్తున్న వారు ఈ మాఘ పౌర్ణమితో దీక్షను విర‌మిస్తారు. 

హైద‌రాబాద్ పేలుళ్ల గురించి ముందుగా చెప్పింది ఎవ‌రు..! ఎలా చెప్పగ‌లిగారు..!


ఏ విష‌యం అయినా ముందుగా చెప్పిన వారి గురించే చెప్పుకొంటారు. కానీ ఎలా చెప్పగ‌లిగారు, ఇది ఎలా సాధ్యం అనేది ఆలోచించ‌రు. అలాగ‌ని చాలా సూటిగా ఫ‌లానా చోటే, ఫ‌లానా స‌మ‌యంలోనే, ఫలానా వ్యక్తులే పేలుళ్లు చేస్తారు అని చెప్పటం కుద‌రదు. కానీ, ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌చ్చు అని మాత్రం చెప్పవ‌చ్చు. మ‌న ఇంటెలిజెన్స్ విభాగం కూడా ఇదే మాదిరిగా హెచ్చరిక‌లు చేస్తూ ఉంటుంది. నిర్దిష్టంగా, ఈ మాదిరిగా జ‌రుగుతుంద‌ని చెప్పలేరు. కానీ ఘ‌ట‌న చోటు చేసుకొనే అవ‌కాశం ఉంటుందని హెచ్చరిక చేయ‌గ‌లుగుతారు.
పేలుళ్ల వంటి విధ్వంస కాండ చోటు చేసుకోవ‌డానికి జ్యోతిష శాస్త్ర వేత్తలు ముందుగానే విశ్లేషించ‌గ‌లిగారు. నంద‌న నామ సంవ‌త్సరానికి సంవ‌త్సర అధిప‌తి గా కుజుడు ఉండ‌టం, సేనాధిప‌తిగా గురుడు వ్యవ‌హ‌రిస్తుండ‌టం జ‌రుగుతోంది. ఈ ఇద్దరూ గోచార రీత్యా స్థాన‌ములు మారుతున్నారు. ఈ స‌మ‌యంలో ఇటువంటి విళ‌య కాండ జ‌ర‌గ‌వ‌చ్చన్నది జ్యోతిషుల అంచ‌నా. దీని కారణంగా స‌మాజంలో సంఘ‌ర్షణ చోటు చేసుకొంటుంద‌ని విశ్లేషించ‌గ‌లిగారు.
జ్యోతిషం కూడా ఇంటెలిజెన్స్ హెచ్చరిక మాదిరిగానే ప‌ని చేస్తుంది. ఈ స‌మ‌యంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకొనే అవకాశం ఉంటుంద‌ని మాత్రం చెప్పగ‌ల‌రు. అయితే దీనికి ఆయా నగ‌రాల జ‌న్మ ల‌గ్నం, వాస్తు వంటి అంశాల ప్రాతిప‌దిక‌న ఎక్కడ చోటు చేసుకోవ‌చ్చు అన్నది విశ్లేషించేందుకు వీల‌వుతుంది. అంతే గానీ, ఫ‌లానా తేదీ, ఫ‌లానా గంట‌, ఫ‌లానా స‌మ‌యం, ఫ‌లానా వీధి, ఫలానా సెంట‌ర్ అనేది చెప్పటం క‌ష్టంగా ఉంటుంది. అందుచేత శాస్త్రీయంగా న‌మ్మకాన్ని ఉంచి ఆలోచిస్తే ముందుగానే ప‌సిగ‌ట్టడం ఎలా సాధ్యం అనేది అర్థం అవుతుంది.

సడెన్ గా వ‌ర్షం ఎందుకు ప‌డిన‌ట్లు..!

ఫిబ్రవ‌రి నెల‌లో ఒక్క సారిగా వాన‌లు కురిశాయి. అకాల వ‌ర్షాల‌కు అనేక చోట్ల పంట‌లు దెబ్బతిన్నాయి. 52 వేల ఎక‌రాల్లో పంట నీట మునిగింది. ఇంత‌కీ ఫిబ్రవ‌రిలో వాన‌లు ఎందుకు ప‌డుతున్నాయి అనే అనుమానం కలుగ వ‌చ్చు.

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టద‌న్నది న‌మ్మకం. వాన‌లు ప‌డటాన్ని కూడా ఇదే కోణం లో అర్థం చేసుకోవ‌చ్చు. నంద‌న నామ సంవ‌త్సరానికి రాజు గా శుక్రుడు ఉన్నాడు. ధాన్యాధిప‌తి శ‌ని, అర్ఘాధిప‌తి గురుడు, మేఘాధిప‌తి గురువు, ర‌సాధిప‌తి గురువు, నీర‌సాధిప‌తి కుజుడు గా ఉన్నారు. ఆవ‌ర్తక నామ మేఘ‌మున గాని మంచి ధాన్యం, గోధుమ‌లు, జొన్నలు, సెన‌గ‌లు, ప‌త్తి, నూనె గింజ‌లు మొద‌లగు వాని ఉత్పత్తికి హాని క‌లుగుతుంద‌ని జ్యోతిషులు ఈ ఏడాది ప్రారంభంలోనే అంచ‌నా వేశారు. ఈ ఏడాది వ‌ర్ష కుండ‌లి రీత్యా తులా లగ్నం అయింది. వ‌ర్ష ప్రమాణం స‌ముద్ర మందు ఏడుభాగ‌ములు, ప‌ర్వత‌ములందు తొమ్మిది భాగ‌ములు, భూమిపై నాలుగు ప్రమాణ‌ములు ఉండును. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వ‌ర్షము ఉంటుంద‌ని ముందుగానే విశ్లేషించ‌డ‌మైన‌ది. ఇందులో భాగంగానే ఆక‌స్మికంగా వాన‌లు పోటెత్తాయి. తెలంగాణ‌, రాయ‌ల‌సీమ జిల్లాల్లో మ‌రిన్ని వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అర్థం అవుతోంది. మొక్క జొన్న, పొద్దు తిరుగుడు, జొన్న, వేరుశ‌న‌గ‌, శ‌న‌గ‌, మిర‌ప‌, అర‌టి, నువ్వుల పంట‌ల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈ అకాల వ‌ర్షాలు శాంతించి రైత‌న్నకు ఊర‌ట క‌ల‌గాల‌ని భ‌గ‌వంతుడ్ని ప్రార్థిద్దాం..!

రేప‌టి రోజున త‌ప్పకుండా గుర్తు పెట్టుకోండి...!

రేప‌టి ఆదివారానికి ఒక ప్రత్యేక‌త ఉంది. మాఘ‌పు ఆదివారం అంటే సూర్య భ‌గ‌వానుడి అర్చన‌కు ఎంతో ప్రాశ‌స్త్యమైనది. ప్రతీ మాఘ ఆదివారం నాడు వేకువ జామునే లేచి సూర్యోద‌యం అయిన పిమ్మట ఎండ త‌గిలే చోట సూర్యుడ్ని ఆవాహ‌న చేసుకొని పూజ‌లు చేసుకొంటారు. ఈఏడాది ర‌థ స‌ప్తమి కూడా ఆదివారం నాడే వ‌చ్చింది. దీంతో సూర్యుడ్ని ఆరాధించ‌టానికి మ‌రింత మంచి స‌మ‌యం వచ్చింద‌నుకోవ‌చ్చు.

 ర‌థ సప్తమి రోజు న వీలుంటే న‌దీ స్నానం ఆచ‌రించ‌టం మేలు. లేని ప‌క్షంలో ఇంటిలోనే వేకువ జామున స్నానం చేయాలి. ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి

॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥

॥ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాౕజ్నాతేచ యే పునః ॥

॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥

అనంత‌రం ప్రశాంతంగా సూర్య దేవుడ్ని అర్చించుకోవాలి. చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయ‌లు, చిక్కుడు పువ్వులతో పూజ చేస్తారు. పాయ‌సం వండి వేడి వేడిగా సూర్యుడికి నివేద‌న చేస్తారు. ర‌థ స‌ప్త మి రోజు ఉద‌యం పూజ‌తో ప‌నులు ప్రారంభిస్తే మంచింది. ఈ స‌మ‌యంలో ఆదిత్య హృద‌యం పారాయ‌ణం చాలా మంచిది. ఆదిత్య హృద‌యం విశిష్టత గురించి ఎంత చెప్పినా త‌క్కువే. రామాయణ కాలంలో రామచంద్ర ప్రభువు దీంతో ప్రభావితం అయిన‌ట్లు చెబుతారు. ఆదిత్య హృద‌యం పారాయణం తో రోగాలు నివార‌ణ అవుతాయ‌ని, మానసికంగా ధైర్యం క‌లుగుతుంద‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా ఆదిత్య హృద‌యం పారాయ‌ణ మరిచిపోవ‌ద్దు.



ఈ రోజు ఈ ప‌ని చేయ‌టం మ‌రిచిపోవ‌ద్దు..!

ఎంత‌టి వారి కైనా మ‌ర‌పు అన్నది స‌హ‌జం. ప‌నుల ఒత్తిడిలో ఉన్నప్పుడు, టెన్షన్ కు గురైన‌ప్పుడు మ‌రిచి పోవ‌టం అన్నది చోటు చేసుకొంటుంది. కానీ ముఖ్యమైన ప‌ని పెట్టుకొన్నప్పుడు మాత్రం మ‌రిచిపోకుండా ఉండాలి సుమా..!

వ‌సంత పంచ‌మి లేక శ్రీ పంచ‌మి అన్నది స‌ర‌స్వతీ అమ్మ వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున అమ్మల గ‌న్నయ‌మ్మ ను స‌రస్వతి రూపంలో అర్చించుకోవ‌టం చాలా శుభ‌క‌రం. స‌రస్వతీ దేవి కొలువైన బాస‌ర‌, వ‌ర్గల్ వంటి క్షేత్రాల్ని సంద‌ర్శిస్తే మంచిదే. లేదా ఇటీవ‌ల కాలంలో ప్రతీ ప్రాంతంలోనూ స‌ర‌స్వతీ దేవి ఆల‌యాలు ఉంటున్నాయి కాబ‌ట్టి ద‌గ్గర‌లోని స‌ర‌స్వతి ఆల‌యానికి వెళ్లి అర్చన‌లు జ‌రిపించుకోవ‌చ్చు. క‌నీసం ఇంటి దగ్గర అయినా స‌ర‌స్వతీ దేవిని భ‌క్తి శ్రద్దల‌తో పూజించుకోవాలి. ముఖ్యంగా ఈ పూజను పిల్లల చేత చేయించాలి. విద్యాభివృద్ధికి, విజ్ఞాన వికాసానికి స‌ర‌స్వతీ దేవి అనుగ్రహం ఎంతో ముఖ్యం.
ఇంటిలోనే పూజ చేసుకోద‌లిస్తే శ్రీ సూక్త విధానంగా షోడ‌శోప‌చార పూజ చేసుకోవ‌చ్చు. షోడ‌శోప‌చార పూజ అంటే 16 ర‌క‌ములైన ఉప‌చార‌ములు అమ్మ వారికి స‌మ‌ర్పించు అర్చించే విధానం. ఇది ల‌ఘువుగా చేసుకోవ‌చ్చు. అనంత‌రం కుంకుమార్చన చేయ‌టం మేలు. ఉద‌యం పూట ఆఫీసుకి వెళ్లాల్సిన హ‌డావుడి ఉంటే సాయంత్రం పూట చేసుకోవ‌చ్చు. ప్రశాంతంగా అమ్మవారిని మ‌న‌సా వాచా త‌ల‌చుకొని ఈ పూజ చేసుకోవ‌చ్చు. త‌ర్వాత ల‌లితా స‌హస్రం, స‌రస్వతీ సూక్తం వంటివి పారాయ‌ణ చేసుకోవ‌చ్చు.

మాఘ మాసం ఎప్పుడోస్తుందో..!

మాఘ మాసం ఎప్పుడు వ‌స్తుందో అని ఎదురు చూడాల్సిన ప‌ని లేదు. ఇప్పటికే మాఘ మాసం వ‌చ్చేసింది. ప్రతీ మాసానికి ఒక విశిష్టత ఉన్నట్లే ఈ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో శివ కేశ‌వులు ఇద్దరికీ ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ది. అంతే కాకుండా పితృ దేవ‌త‌ల ఆరాధ‌న‌కు కూడా త‌గిన రోజుగా చెప్పవ‌చ్చు. ఈ మాసంలో స్నాన‌ము ప్రత్యేకంగా చెప్పద‌గిన‌ది. ఎందుకంటే ఈ మాసం సూర్య భగ‌వానుడికి ఎంతో ఇష్టమైన‌ది అందుచేత ఈ మాసంలో ప్రాతః కాలంలో విధి విధానంగా స్నానం చేస్తే పుణ్యలోక ప్రాప్తి క‌లుగుతుంది.  సూర్యోదయము కాగానే జలములన్నీ శబ్దిస్తాయి .. త్రివిధములైన సర్వ పాపములనూ పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ఉషః కాలములో సూర్యకిరణములతో వేడెక్కిన అందమైన నదీ ప్రవాహమునందు స్నానమాచరించిన వారు పితృ , మాతృ వంశములకు చెందిన తన సప్త ఋషులను ఉద్ధరించి , పిదప అమర దేహుడై స్వర్గమునకు వెళతాడు. అరుణోదయము కాగానే విచక్షణుడు మాధవుని పాద ద్వంద్వమును స్మరిస్తూ స్నానం చేస్తే సురపూజితుడవుతాడు. సూర్యోద‌య‌మున‌కు ముందే స్నానం చేస్తే ఉత్తమం. సూర్యోద‌య స‌మ‌యంలో స్నానం మ‌ద్యమం. సూర్యోద‌యం త‌ర్వాత స్నానం చేస్తే త‌క్కువ ఫ‌లితం ఉంటుంది. మిగిలిన రోజుల‌తో పోలిస్తే పౌర్ణమికి ముందు మూడు రోజులు మ‌రింత ప్రాశ‌స్త్యం అనుకోవ‌చ్చు. శక్తి కొద్దీ అన్నదానము చేయాలి. వేదవిద్వాంసునకు దానం చేయాలి. మాఘమాసాంతమందు షడ్రస భోజనమాచరించాలి.

    నిజానికి ప్రాతఃస్నానము పుష్య మాస శుక్ల పక్ష ఏకాదశిన మొదలు పెట్టి మాఘ శుక్ల ద్వాదశిన గానీ , పౌర్ణమి యందు గానీ సమాప్తి చేయాలి. రోజు భూమిపై పరుండాలి ( మంచము వదలి ) నెలరోజులు మితాహారుడై , లేదా నిరాహారుడై త్రికాలములయందు స్నానము చేసి , భోగములను వదలి , జితేంద్రియుడై త్రికాలాలలోను విష్ణువును అర్చించాలి. దీన్ని మాఘ వ్రతం అంటారు. పురాణముల‌ ప్రకారము , బ్రహ్మచారి , గృహస్థు, వానప్రస్థుడు , భిక్షకుడు , బాలురు , వృద్ధులు, యువకులు , స్త్రీలు , నపుంసకులు  అందరూకూడా మాఘమాసమందు శుభమైన తీర్థమందు స్నానం చేసి, కోరిన ఫలమును పొందుతారు. అవయవములు దృఢం గా ఉన్నవారు చన్నీటి తోను , లేనివారు వేడి నీటి తోను స్నానం చెయ్యవచ్చు. పుష్య పౌర్ణమి గడిచాక మాఘ పౌర్ణమి వచ్చే వరకు విష్ణుపూజ విధిగా చేయాలి.
ఈ మాసంలో సూర్యారాధ‌న చెప్పద‌గిన‌ది. ముందే చెప్పినట్లుగా ఈ మాసం ఆయ‌న‌కు ఎంతో ఇష్టమైన‌ది. ముఖ్యంగా ఆదివారం నాడు సూర్య భ‌గ‌వానుడ్ని త‌ప్పక అర్చించాలి. ఆ రోజున సూర్యుని వైపు తిరిగి పూజ చేసుకొంటారు. సంక‌ల్పం చేసుకొని చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయ‌లు సేక‌రించి ర‌థం చేస్తారు. దీనిపై సూర్య భ‌గ‌వానుడ్ని లోహ రూపంలో ఆవాహ‌న చేసుకొంటారు. సూర్యుడ్ని షోడ‌శ ఉప‌చార‌ముల‌తో పూజించి పాయ‌సం లేక పొంగ‌లి త‌యారుచేసి నివేద‌న చేస్తారు. పాలు పొంగిన‌ట్లు సౌభాగ్యం పొంగాల‌ని వేడుకొంటారు. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆన‌వాయితీ.
ఇక ఈ మాసంలో వ‌చ్చే విశిష్ట పండుగ ర‌థ స‌ప్తమి. దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి  అని అంటారు.       ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేస్తే , షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి , సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.  నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి  భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి.      సూర్యుణ్ణి   ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనం తో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వివస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
మాఘ మాసంలో మంచి ఆలోచ‌న‌ల‌తో చ‌క్కటి ఆరాధ‌న‌లు చేసుకొని మాఘ మాస ప్రత్యేక‌త‌ను చాటుదాం.. శుభ‌మ‌స్తు..!

ఫిబ్రవ‌రి 14 వేలంటైన్స్ డే మాత్రమే కాదు.. ఇంకో ప్రత్యేక‌త కూడా ఉంది..!

ఫిబ్రవ‌రి 14 అంటే చాలామందికి వేలంటైన్స్ డే గుర్తుకొని వ‌స్తుంది. దీన్ని ప్రేమికుల రోజుగా ఈ కాల‌పు యూత్ గుర్తుంచుకొంటారు. ఈ సంవ‌త్సరం ఫిబ్రవ‌రి 14 కు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే మాఘ శుద్ధ పంచ‌మి అంటే వ‌సంత పంచ‌మి అని అర్థం. చ‌దువుల తల్లి స‌రస్వతి దేవి కి ఎంతో ప్రీతిక‌ర‌మైన రోజు. అందుకే వ‌సంత పంచ‌మి రోజున అమ్మవారిని అర్చించుకోవ‌టం ఉత్తమం.

భార‌తీయ సంప్రదాయంలో స‌రస్వతీ దేవికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ వాణీ గిరిజాశ్చర‌యా... అంటూ అమ్మల గ‌న్న అమ్మ వారిని త‌ల‌చుకొని వాజ్మయం మొద‌లైంది. అంటే సాహిత్యం మొద‌లైన‌దే అమ్మ వారి ప్రస్తావ‌న‌తో అంటారు. అందుకే ఏదైనా కార్యక్రమం మొద‌లు పెడితే శ్రీ‌కారం చుట్టార‌ని చెబుతారు. ఎందుకంటే సాహిత్య సృష్టి అన్నది శ్రీ కారంతో మొద‌లైంది కాబ‌ట్టి శ్రీ‌కారం చుట్టడం అన్న నానుడి ప్రారంభం అయింది. ఈ విష‌యం ప‌క్కన పెడితే .. స‌ర‌స్వతి దేవిని కొలిచాకే విద్యను అభ్యసించ‌టం ఆన‌వాయితీ. అందుకే చ‌దువుకొంటున్న వారంతా ఈ వ‌సంత పంచ‌మి రోజున క‌చ్చితంగా స‌ర‌స్వతీ పూజ చేసుకోవాలి. క‌నీసం స‌ర‌స్వతీ స్తోత్రాన్ని ప‌ఠించాలి. వ‌సంత పంచ‌మి రోజున భ‌క్తి తో పుస్తకాలు అమ్మవారి స‌మ‌క్షంలో ఉంచి పూజించ‌ట ఆన‌వాయితీ.
స‌ర‌స్వతీ న‌మ‌స్తుభ్యం వ‌ర‌దే కామ‌రూపిణీ
విద్యారంభం క‌రిష్యామి సిద్దిర్భవ‌తు మే స‌దా..!
ప‌ద్మ ప‌త్ర విశాలాక్షీ ప‌ద్మ కేస‌ర వ‌ర్థిని
నిత్యాం ప‌ద్మాల‌యాం దేవీం సామాంపాతు స‌ర‌స్వతీ..!
అంతే గాకుండా అమ్మవారి ఆరాధ‌న‌కు వ‌సంత పంచమి మంచి రోజు.  ఆ రోజున మాఘ శుద్ద పంచ‌మి రోజున అమ్మ వారి ని శ్రీ సూక్త స‌హితంగా అర్చిస్తే మేలు. వేకువ జామున లేచి త‌ల స్నానం చేసి పువ్వులు, కుంకుమ‌తో అమ్మ వారి ఆరాధ‌న చేసుకోవాలి. పాయసం వండి నైవేద్యం చెల్లించ‌వ‌చ్చు. ఉద‌యం పూట కాలేజీల‌కు, ఆఫీసుల‌కు ప‌రిగెత్తినా క‌నీసం సాయంత్రం అయినా శ్రేష్టంగా పూజ చేసుకోవ‌చ్చు. పూజ‌కు భ‌క్తి ముఖ్యం క‌దా..!

మంచి చెడు ఎలా చెప్పుకోవ‌చ్చు...!

మంచి అన్నది ఎప్పుడు మంచే. మంచి స‌మ‌యం అన్న దానికి స్పష్టమైన నిర్వచ‌నం ఏమీ లేదు. పంచాంగం ప్రకారం కొన్ని వేళ‌ల్ని మంచి స‌మ‌యంగా గుర్తిస్తారు. ఇందుకు కొన్ని ప్రాతిప‌దిక‌లు ఉన్నాయి. మొద‌ట‌గా తిథిని చూసుకొంటారు. సాధ్యమైనంత వ‌ర‌కు విదియ‌, పంచ‌మి, స‌ప్తమి, ద‌శ‌మి, ఏకాద‌శి, త్రయోద‌శి ని శుభ‌ప్రదం గా భావిస్తారు. దీని త‌ర్వాత న‌క్షత్రాన్ని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవాలి. తాము పుట్టిన న‌క్షత్రం నుంచి ఆ రోజు న‌క్షత్రం ఏ సంఖ్యలో ఉందో చూసుకోవాలి. 2, 4, 6, 8, 9 సంఖ్య వ‌స్తే మంచిద‌ని చెబుతారు. ఇది శాస్త్రీయ‌మైన గ‌ణ‌న గా భావించాలి. దీని త‌ర్వాత రాహుకాలం, య‌మ‌గండం, గుళికా కాలం లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు చాలా మంది హోర చూసుకొంటారు. శుభ గ్రహ స‌మ‌యం ఉన్నప్పుడు మేల‌ని చెబుతారు. అయితే ప్రతీ ప‌నికి ఇవ‌న్నీ చూసుకోవాల‌ని కాదు. రోజు చేసే ప‌నుల‌కు కూడా ఇవ‌న్నీ చూసుకొంటే ప‌నులేవీ ముందుకు సాగ‌వు. అలాగ‌ని ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లటం కూడా స‌రికాదు. అయితే ఏదైన పెద్ద ప‌నులు సంక‌ల్పించిన‌ప్పుడు మాత్రం ముహుర్త శాస్త్రం తెలిసిన వారి ద‌గ్గర ముహుర్తం పెట్టించుకోవ‌టం ఉత్తమం.

విశ్వరూపం సినిమాకు క‌ష్టాలు అందుకేనా..!

విశ్వ రూపం సినిమా ఈ మ‌ధ్య కాలంలో బాగా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా విడుద‌ల మీద వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ అంశం ఇప్పటికే హైకోర్టు దాకా వెళ్లింది. ఈ సినిమా విడుద‌ల కాక‌పోతే తాను పూర్తిగా క‌ష్టాల్లో ఇరుక్కొని పోతాన‌ని క‌మ‌ల్ స్వయంగా చెప్పారు.

అస‌లు సినిమా వంటి క‌ళా రూపాలు మొద‌లు పెట్టిన‌ప్పుడు చాలా అంశాలు చూసుకొంటారు. అందులో ముహుర్తం కూడా ఒక‌టి. ఒక పని ప్రారంభించేటప్పుడు సరైన స‌మ‌యం చూసి మొదలు పెట్టాలి. ఆ ప‌ని ఏ స్వభావానికి సంబంధించిందో చూసుకొని దానికి త‌గిన‌ట్లుగా ఈ స‌మ‌యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే దానికి త‌గిన ఫ‌లితాలుక‌నిపిస్తాయి. అదే విధంగా ముహుర్త స‌మ‌యంలో చేయాల్సిన క్రియ‌లు కూడా ముఖ్యమే. ఇటువంటి స‌మ‌యంలో జ‌రిగే అప‌శృతులు త‌ర్వాత కాలంలో ఇబ్బందుల‌కు కార‌ణం అవుతాయ‌న్నది కొంద‌రి న‌మ్మిక‌. ఆ విష‌యాన్ని ప‌క్కన పెడితే ప్రస్తుతం క‌మ‌ల్ జాత‌కంలో కూడా ఇబ్బందులు గోచ‌రిస్తున్నాయి. అందుకే మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతున్నార‌న్నది జ్యోతిషుల అభిప్రాయం. ఎటువంటి ప‌రిస్థితుల్లో అయినా మాన‌సిక ఒత్తిడి కి గురైతే పొర‌పాట్లు దొర్లిపోతాయి. అందుకే తీవ్ర ఎగుడు దిగుళ్లు చూసిన క‌మ‌ల్ హాస‌న్ ఇప్పుడు బ‌హిరంగంగా ఆవేద‌న చెందాల్సి వ‌చ్చిందని చెబుతారు. ఏది ఏమైనా ఒక క‌ళాకారుని ఆవేద‌న వెనుక ఆర్ద్రత ముఖ్యం అన్నది గుర్తుంచుకోవాలి.

రాజ‌కీయాల్ని జ్యోతిషంతో ప‌రిశీలించ వ‌చ్చా..! ఎన్నిక‌ల ఫ‌లితాలు, తెలంగాణ సాధ‌న ను జ్యోతిషులు చెప్పగ‌లుగుతారా..!

రాజ‌కీయం అన్నది ప్రస్తుత స‌మాజంలో అంద‌రితోముడిప‌డిన అంశం. రాజకీయాలు లేకుండా ఆధునిక స‌మాజాన్ని చూడ‌టం సాధ్యం కాదు. అంద‌రి జీవితాల‌తో ముడి ప‌డి ఉన్న అంశంగా రాజ‌కీయాల్ని చెప్పవ‌చ్చు. ప్రజాస్వామ్యంలో ప‌రిపాల‌న పూర్తిగా రాజ‌కీయ పార్టీల చేతుల్లో ఉంటాయి. అందుచేత రాజ‌కీయ పార్టీలు ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా ప్రజ‌ల్ని ప్రభావితం చేస్తుంటాయి.

 అయితే రాజ‌కీయ పార్టీల‌ను జ్యోతిషంతో ప‌రిశీలించేందుకు ఒక ప‌ద్దతిని అనుస‌రిస్తుంటారు. వ్యక్తుల జాత‌కాన్ని చూసేందుకు ఏ విధంగా అయితే పుట్టిన తేదీ, స‌మ‌యం, పుట్టిన స్థలం చూసి జాత‌క చ‌క్రం గ‌ణించి ఫ‌లితాల్ని అంచ‌నా వేస్తుంటారు. అదే మార్గంలో ఒక రాజ‌కీయ పార్టీ ఎప్పుడు ఆవిర్భవించింది, ఎక్కడ ఆవిర్భవించింది ఆ స‌మ‌యంలో ఉన్న గ్రహ దృష్టి ఎలా ఉన్నది గ‌ణించి పార్టీల‌కు జాత‌క చక్రం గ‌ణిస్తారు. పార్టీల జాత‌క చ‌క్రంతో పాటు ఆ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న వారి జాత‌క చ‌క్రం, పార్టీల ప్రధాన కార్యాల‌యాల వాస్తుని క‌లుపుకొని పార్టీల ఫ‌లితాల్ని అంచ‌నా వేస్తుంటారు. దీని ఆధారంగానే ఆ పార్టీ పాల్గొనే ఎన్నిక‌ల ఫ‌లితాలు, ఉద్యమాల ప్రభావం వంటివి విశ్లేషించి చెబుతారు.

జ్యోతిషం ఒక శాస్త్రమా.. ఒక న‌మ్మక‌మా.. ఒక వేదాంత‌మా..!

జ్యోతిషం మీద వివాదాలు కొత్తేమీ కాదు. దీనిపై ఉన్న విమ‌ర్శలు అన్నీ ఇన్నీ కావు. అస‌లు ఇదంతా ఒక వేస్ట్ అనుకొనే వారికి జ‌వాబు చెప్పటం కూడా వేస్ట్. ఎందుకంటే ఒక న‌మ్మకం బ‌లంగా మ‌న‌స్సులో పెట్టుకొని వాద‌న‌కు దిగుతుంటే ఆ వాద‌న ఎప్పటికీ తెగేది కాదు. అందుచేత జిజ్ఞాస ప‌రుల‌కు జ్యోతిషం అంటే ఏమిటో వివ‌రించ‌టం ఉత్తమం.
జ్యోతిషం అన్న ప‌దం సంస్కృత భాష లోది. జ్యోతి అంటే ఒక దీపం లేక వెలుగు అని అర్థం . అంటే స‌క‌ల మాన‌వాళికి, జీవ కోటికి జ్యోతి వంటి వెలుగులు ప్రసాదించే శాస్త్రం గా జ్యోతిషం ను భావించాల్సి ఉంటుంది. ఇది వేద‌ముల నుంచి ఉద్భవించిన అద్బుత శాస్త్రం. అందుకే ప్రాచీన భార‌తీయ జ్యోతిష శాస్త్ర వేత్తలు ఖండాంత‌రాల్ని దాటిన ఖ్యాతిని ఆర్జించారు.

జీవుల పుట్టుక‌, ఎదుగుద‌ల‌, వృత్తి ప‌ర‌మైన జీవితం, వ్యక్తిగ‌త జీవితం, మాన‌సిక ప‌రిప‌క్వత‌.. ఇలా ఒక‌టేమిటి జీవుడు పుట్టిన నాటి నుంచి గిట్టే వర‌కు ప్రతీ ద‌శ‌ను జ్యోతిషం ద్వారా విశ్లేషించుకోవ‌చ్చు. జ్యోతిషం సాయంతో మాన‌వ జీవితం ఫ‌లవంతం అవుతుంది. ప్రతీ ద‌శ‌లోని జ్ఞాన జ్యోతిలా ప్రకాశిస్తూ భ‌విష్యత్ ద‌ర్శనం చేస్తుంది.
జ్యోతిషం ద్వారా గ్రహ‌గ‌తుల్ని మార్చటం సాధ్యం కాదు సుమా. గ్రహాల ప్రభావం, ఫ‌లితాలు తెలుసుకొనేందుకు వీలవుతుంది. అందుకు అనుగుణంగా జీవ‌న గ‌మ‌నాన్ని స‌రిచేసుకొనే వీలు క‌లుగుతుంది. అంతిమంగా ధ‌ర్మ ప‌ర‌మైన జీవ‌నాన్ని గ‌డిపేందుకు వీల‌వుతుంది. ఇదంతా జ్యోతిషం గురించి ప‌రిచ‌యం మాత్రమే సుమా..! జ్యోతిష శాస్త్రపు అద్భుత విశ్లేష‌ణ‌, వివ‌ర‌ణ త‌దుప‌రి పోస్టుల్లో చూడ‌వ‌చ్చు.

జ్యోతిషం ప్రాశ‌స్త్యం..!

వేదాలు ప్రసాదించిన అద్భుత శాస్త్రముల‌లో జ్యోతిష శాస్త్రం ఒక‌టి. అందుకే దీన్ని జ్యోతిర్వేదం అని కూడా అంటారు. ప్రాచీన భార‌తీయ విజ్ఞాన‌ముల‌లో ఇది అగ్రగ‌ణ్యమైన‌ది. ఈ విజ్ఞానాన్ని రుషి ప‌రంపర నుంచి తాళ‌ప‌త్ర గ్రంధాల‌లోకి అక్కడ నుంచి సంస్కృత వాజ్ఞయంలోకి ప్రవ‌హించింది. దీని నుంచి మ‌న ప్రాచీనులు ఎంతో శ్రమ‌కోర్చి ఇప్పటి త‌రానికి అందిస్తూ వ‌చ్చారు. ఈ అద్భుత విజ్ఞానంపై ఎన్నో ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. విదేశీయులు సైతం ఆస‌క్తిగా దీన్ని అభ్యసిస్తున్నారు.

 ఈ ప్రాచీన విజ్ఞానంలోని అద్భుత ఫ‌లితాల్ని ఎంద‌రో చ‌వి చూశారు. అప్పట్లో రాజుల కొలువులో ఆస్థాన మంత్రి, ఆస్థాన వైద్యుల తో పాటు ఆస్థాన జ్యోతిషులు కూడా ఉండేవార‌ట‌. వాతావ‌ర‌ణం, పంట‌లు, స్థితిగ‌తుల్ని అన్నింటినీ ఆ శాస్త్ర వేత్తలు అంచ‌నా వేసి చెప్పగ‌లిగే వార‌ట‌.  ప‌రాశ‌రుడు, వ‌రాహ మిహిరుడు వంటి మ‌హానుభావులు ఈ శాస్త్ర విజ్ఞానాన్ని లోతుగా మ‌ధించి స‌రళీకరించి అనేక గ్రంథాలు వెలువ‌రించారు. ఈ సాహిత్యంలో చాలా భాగం కాల‌గ‌మ‌నంలో క‌లిసి పోయింది. కొద్ది పాటి శాస్త్ర అంశాల్ని మాత్రం అందుకోగ‌లిగాం. ఈ విజ్ఞానానికే ఆధునిక ప‌రిస్థితుల్ని రంగ‌రించి మ‌న పెద్దలు అభివృద్ధి ప‌రుస్తూ వ‌చ్చారు. త‌ర్వాత కాలంలో దీని నుంచి అనేక శాఖ‌లు ఉద్భవిస్తూ వ‌చ్చాయి. వీటి వివ‌రాలు క్రమంగా చ‌ర్చిద్దాం...

స్వాగ‌తం..


వేదాల్లో నిక్షిప్తమైన జ్యోతిష‌, వైదిక‌, ధార్మిక శాస్త్రాల‌ను స‌ర‌ళంగా అంద‌రికీ అందించాల‌న్నదే మా ప్రయ‌త్నం. ఇందులో ఉండే అంశాలు సూచ‌న‌ల‌గానే ప‌రిశీలించ‌గ‌లరు. అంద‌రికీ అందుబాటులోకి శాస్త్ర విజ్ఞానాన్ని తెచ్చే క్రమంలో అమ్మ వారి ఆశీస్సులు అంద‌రికీ ఉండాల‌ని ఆశిస్తున్నాం..