astrologyhyderabad

హైంద‌వ ధ‌ర్మం లోని అత్యద్భుత శాస్త్రములైన జ్యోతిష‌, వాస్తు, వైదిక శాస్త్రముల‌పై అవ‌గాహ‌న క‌ల్పించే ప్రయ‌త్నం

ఈ స‌మ‌యంలో చేయాల్సిన ప‌ని..!

ఆశ్వ‌యుజ మాసం రానే వ‌చ్చింది. శ‌ర‌న్న‌వ‌రాత్రులు మొద‌ల‌య్యాయి. అమ్మ‌వారి ఆల‌యాల్లో విశేష పూజ‌లు నిర్వ‌హించే స‌మ‌యం ఇది. వీలు కొల‌దీ దేవాల‌యంలో కానీ, ఇంటి ద‌గ్గ‌ర కానీ, మందిరంలో కానీ అమ్మ వారి పూజ చేసుకొంటే మంచిది. సాధ్యం అయితే స‌మూహంతో లేదా ఇంటిల్లి పాది క‌లిసి లేదా ఒంట‌రిగా అయినా ఈ పూజ చేసుకోవ‌చ్చు. ఈ పూజ‌లో నిబంధ‌న‌ల క‌న్నా భ‌క్తికి ప్రాధాన్యం అని గుర్తించుకోవాలి.

అమ్మ వారి అర్చ‌న కు ఉద‌యం కానీ, సాయంత్రం కానీ విశేష స‌మ‌యం. శుచిగా స్నానం ఆచ‌రించి అమ్మ‌వారి ఆరాధ‌న‌కు సంక‌ల్పించాలి. అమ్మ వారికి షోడ‌శ ఉప‌చారాలు స‌మ‌ర్పించి పూజ చేసుకోవ‌చ్చు. శ్రీ సూక్త విధానంగానూ పూజ చేయ‌వ‌చ్చు. ఆ త‌ర్వాత అమ్మ వారికి కుంకుమార్చ‌న చేస్తే మేలు. ల‌లితా స‌హ‌స్రం కానీ, త్రిశ‌తి కానీ, ఖ‌డ్గ‌మాల కానీ జ‌పిస్తూ అమ్మ‌వారికి కుంకుమార్చ‌న జ‌రిపిస్తే మంచిది. ఆ త‌ర్వాత అమ్మ కు ప్రీతిగా నైవేద్యాలు స‌మ‌ర్పించి ప్ర‌సాదం పంచాలి. అమ్మ వారి ఆరాధ‌న‌తో అన్నీ స‌మ‌కూరుతాయ‌న్న‌ది భ‌క్తుల న‌మ్మిక‌. ఏడాది పొడ‌వునా చేసిన అర్చ‌న ఒక ఎత్త‌యితే, ఈ న‌వ‌రాత్రుల్లో చేసిన అర్చన ఒక ఎత్తు. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ఈ అర్చ‌న చేయ‌టం మంచిది.

మొక్క‌లు పెంచ‌టం మంచిది కాదా..!


మొక్క‌లు పెంచ‌టం మంచిది కాద‌ని ఎవ‌రైనా చెబితే దాన్ని న‌మ్మ‌వ‌ద్దు. మొక్క‌ల్ని పెంచ‌టం, చెట్లు పెట్ట‌డం అన్న‌ది హైంద‌వ సంస్కృతిలో ఒక భాగం. దీన్ని అల‌వాటుగా చేసుకొనేందుకు ఒక్కో న‌క్ష‌త్రానికి ఒక్కో మొక్క‌ను సూచించ‌టం జ‌రిగింది. క‌నీసం దీని కార‌ణంగా అయినా ప్ర‌తీ మ‌నిషి ఒక చెట్టును పెంచుతార‌ని భావ‌న‌. అంత అంత‌రార్థంతో చెట్లు పెంచ‌టాన్ని ప్రోత్స‌హించిన సంస్కృతి మ‌న‌ది.

విష్ణుమూర్తి తుల‌సీ ద‌ళం రూపంలో శోభిల్లుతాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. వాస్త‌వానికి ఈ  మొక్క‌లు ఎంతో ఔష‌ధ గుణాలు క‌ల్గి ఉన్నాయి. అటువంటి విలువైన మొక్క‌ల్ని పెంచ‌టం, ఆయా ఆకుల్ని ఉప‌యోగించ‌టం వ‌ల‌న ఔష‌ధ గుణాలు ల‌భిస్తాయి. అందుచేత ఇటువంటి మొక్క‌లు, ప‌త్రాల వినియోగాన్ని ప్రోత్స‌హించ‌టం జ‌రిగింది. అదే స‌మ‌యంలో ప‌త్తి  వంటి మొక్క‌ల్ని పెంచ‌టం మంచిది కాదంటారు. దీనికి కార‌ణం ఏమిటంటే ప‌త్తి నుంచి వ‌చ్చే దూది ఎగిరి క‌ళ్ల‌కు ఇబ్బంది క‌ల్గిస్తుంది కాబ‌ట్టి ఆ ర‌కంగా చెబుతారు త‌ప్పితే మొక్క‌ల పెంచ‌టం స‌రైన చ‌ర్యే అని గుర్తుంచుకోవాలి.

ప‌ని మొద‌లు పెట్టేట‌ప్పుడు గ‌మ‌నించాల్సిన‌వి..!


ఏ పూజ చేసినా మొద‌ట‌గా కొల‌వాల్సింది గ‌ణ‌ప‌తినే. అటువంటి గ‌ణ‌ప‌తి పూజ‌లో శ్ర‌ద్ద ముఖ్యం. గ‌ణ‌ప‌తి కి ప‌త్రి అంటే చాలా ఇష్టం. అందుకే సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌త్రి తో పూజించ‌టం మేలు. అందునా గ‌రిక అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అందుచేత గ‌రిక తో పూజించేందుకు ప్ర‌య‌త్నించాలి. 21 సార్లు గ‌రిక‌తో పూజిస్తే గ‌ణ నాధుడు ఎంతో సంతోషిస్తాడు. క‌నీసం 5 సార్లు అయినా పూజిస్తే మేలు. లేదంటే అక్షిత‌ల‌తో పూజించుకోవ‌చ్చు. అయితే అక్షిత‌లు క‌ల‌ప‌టంలో ప‌సుపు ను నీటితో క‌న్నా ఆవునేతితో క‌లిపితే మంచిద‌న్న మాట ఉంది. ఏమైనా షోడ‌శ ఉప‌చారాల‌తో గ‌ణ నాధుడ్ని పూజించి ఆ త‌ర్వాత ఏ కార్య‌క్ర‌మ‌మైనా సంక‌ల్పిస్తే శుభం క‌లుగుతుంది.

పసుపు తో వినాయ‌కుడి ప్రాధాన్యం ఏమిటి..!

ప‌సుపు తో వినాయ‌కుడ్ని త‌యారుచేసుకొని పూజ చేసుకొంటుంటాం. కేవ‌లం వినాయ‌కుడ్నే ఈ రూపంలో పూజ చేసుకొంటాం. ప్ర‌తీ పూజ‌కు, శుభ కార్యాల‌కు ముందు గ‌ణ‌పతి పూజ త‌ప్ప‌నిస‌రి. ఆఖ‌రికి వినాయ‌క వ్ర‌తం చేసే ముందు కూడా ప‌సుపుతో చేసిన గ‌ణ‌ప‌తికి అర్చించుకొంటాం. విఘ్నాలు ఏర్ప‌డ‌కుండా ఉండాల‌ని, త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకొంటూ ఈ ప‌సుపు వినాయ‌కుడ్ని అర్చించుకోవ‌టం ఆన‌వాయితీ.

వాస్త‌వానికి ప‌సుపు తో వినాయ‌కుడ్ని చేయ‌టంపై భిన్న క‌థ‌నాలు ఉన్నాయి. అందులో ప్ర‌ధాన‌మైన‌ది త్రిపురాసుర సంహారానికి సంబంధించిన‌ది. ఆ స‌మ‌యంలో నందీశ్వ‌రుడి మూడో కొమ్ము అయిన పసుపు కొమ్ము ప‌డిపోయిన‌ది. అది ఎక్క‌డ‌కు పోయిందో అని ఆందోళ‌న చెందుతున్న స‌మ‌యంలో దీన్ని ... సూక్ష్మ బుద్ది గ‌లిగిన వినాయ‌కుడు వెద‌కి తెచ్చిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుచేత వినాయ‌కుడిని ప‌సుపు ముద్ద రూపంలో పూజిస్తే ఎటువంటి కార్య‌మైనా నెర‌వేరుతుంద‌ని వ‌రం ఇచ్చిన‌ట్లు చెబుతారు. అప్ప‌టినుంచి వినాయ‌కుడ్ని పసుపు ముద్ద రూపంలో అర్చించ‌టం ఆన‌వాయితీ గా వ‌స్తోంది. అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజిస్తే స‌క‌ల శుభాలు క‌లుగుతాయి.

అంద‌రికీ తెలిసిందే అయిన‌ప్ప‌టికీ ... ఒక కొత్త విష‌యం తెలుసుకొందాం..!


తెలిసిన విష‌యాలు చాలా ఉంటాయి కానీ అందులోని అంత‌రార్థం తెలుసుకొంటే మాత్రం వివ‌ర‌ణ పూర్తిగా తెలుస్తుంది.

నుదుట‌న కుంకుమ బొట్టు పెట్టుకొంటాం మ‌న సాంప్ర‌దాయం. దీనికి బ‌దులు ఇప్పుడు స్టిక్క‌ర్ లు పెట్టుకోవ‌టం అలవాటైంది. దీని మీద వ్యాఖ్యానించ‌ద‌ల‌చుకోలేదు. కానీ నుదుట‌న కుంకుమ పెట్టుకోవ‌టం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. నుదిటి ప్రాంతంలో నాడీ వ్య‌వ‌స్థ కు చెందిన కీల‌క నాడుల‌న్నీ ఒకే చోట పోగు ప‌డి ఉంటాయి. ఇక్క‌డ నుంచే మెద‌డుకు వెళ్లే నాడులు సాగుతుంటాయి. ఇక్క‌డ ఉండే ర‌క్త నాళాల్లో చురుగ్గా ర‌క్త ప్ర‌స‌ర‌ణ జ‌రుగుతు ఉంటుంది. ఆ ఉధృతికి త‌గిన‌ట్లుగానే ఇక్క‌డ ఒత్తిడి ఉంటుంది. అందుచేత అక్క‌డ చ‌ల్ల‌ద‌నాన్ని ఇచ్చే విధంగా బొట్టు పెట్టుకొంటే మంచిది. ఇందుకోసం పూర్వ కాలంలో అర‌టి బొట్టు పెట్టుకొనేవారు. అర‌టి బొట్టు అంటే అర‌టి చెట్టు ని కూల్చిన‌ప్పుడు కొంత మేర న‌ల్ల‌గా ఏర్ప‌డుతుంది. ఆ కాండ‌ము ను క‌త్తిరించి ఆర పెట్టిన‌ప్పుడు ఇది ఏర్ప‌డుతుంది. దీన్ని సేక‌రించి బొట్టుగా పెట్టుకొనే సాంప్ర‌దాయం ఉంది. కొన్ని చోట్ల మారేడు ద‌ళాలు ఎండ పెట్టి కాల్చి దీన్ని బొట్టుగా ధ‌రిస్తారు. క‌నీసం ప‌సుపు నుంచి త‌యారు చేసిన కుంకుమ ను బొట్టుగా పెట్టుకొన్నా చాలా మంచిదే. అందుచేత ఏ రూపంలోని బొట్టుని అయినా ధ‌రించ‌టం వ‌ల‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అంతే కాకుండా ముఖ వ‌ర్చస్సు కూడా నిండుగా ఉంటుంది. ఆడ‌వారు మాత్ర‌మే కాదు మ‌గ వారు కూడా చ‌క్క‌గా బొట్టు పెట్టుకొంటే ఆరోగ్య వంతంగా సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండ‌టానికి వీల‌వుతుంది. ఆలోచించి చూడండి..!

భాద్ర ప‌ద మాసం లో మ‌రిచిపోకూడ‌ని విష‌యం..!

భాద్ర‌ప‌ద మాసం వేగంగా గ‌డిచిపోతోంది. ఇప్ప‌టికే శుక్ల ప‌క్షం స‌గం రోజులు గ‌డ‌చిపోయాయి. నాలుగు రోజుల్లో పౌర్ణ‌మి వ‌చ్చేస్తుంది. ఈ పౌర్ణమి త‌ర్వాత వ‌చ్చే కృష్ణ ప‌క్షానికి ప్రాధాన్యం ఉంది.

మ‌నం జీవితంలో ఉన్న‌త స్థితికి చేరాల‌న్నా, చ‌క్క‌గా స్థిర ప‌డాల‌న్నా పెద్దల ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. ముఖ్యంగా పితృ దేవ‌తలు సంతృప్తి చెంది ఆశీర్వ‌దించ‌టం ముఖ్యం. అందుకే పెద్ద‌లు స్వ‌ర్గ‌స్తుల‌యిన రోజున (వ‌ర్ధంతి) గుర్తు ఉంచుకొని వారి పేరుతో ఆబ్దికం పెట్ట‌డం లేదా పుణ్య క‌ర్మ‌లు ఆచ‌రించ‌టం లేదా ప్రార్థ‌న‌లు చేయ‌టం చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. అందుకే పెద్ద‌లు అంద‌రినీ ఒక రోజు గుర్తు చేసుకొనేందుకు మ‌హాల‌య పక్షాలు అనే ఏర్పాటు చేశారు. అంటే ఈ భాద్ర‌ప‌ద మాసంలోని కృష్ణ ప‌క్షంలో నిర్దిష్ట మైన రోజును స‌రి చూసుకొని ఈ ప‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఆరోజున ఒక పుణ్య క‌ర్మ చేసే విధంగా మ‌ల‌చుకోవ‌చ్చు. మంత్ర స‌మాప్తిగా భోజ‌నం పెట్ట వ‌చ్చు లేదా పూజ‌లు చేసుకోవ‌చ్చు. క‌నీసం నిరుపేద‌ల‌కు దానం చేయ‌వ‌చ్చు. ఆరోజు చేప‌ట్టే పుణ్య కర్మ‌లు విశేషంగా ఫ‌లిస్తాయ‌ని గుర్తుపెట్టుకోవాలి. అందుచేత మ‌హాల‌య ప‌క్షాలు పాటించ‌టం మంచిది. కొంద‌రు మాత్రం ఇది ఆన‌వాయితీ లేద‌ని చెబుతుంటారు. కానీ ఇటువంటి మంచి ప‌ని మొద‌లు పెట్ట‌డ‌మే ఆన‌వాయితీ అవుతుంద‌ని గుర్తుంచుకోవాలి.

మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లిపోతోంది.. సాయంత్రం పూజ చేయ‌వ‌చ్చా..?

వినాయ‌క చ‌వితి రోజున కొంత‌మందికి వ‌చ్చిన సందేహం ఇది. ఎందుకంటే ఇవాళ మ‌ధ్యాహ్న స‌మ‌యంలోనే చ‌వితి వెళ్లిపోతోంది. అటువంట‌ప్పుడు పూజ చేయాలా వ‌ద్దా అనే అనుమానం వెంటాడుతోంది.
వాస్త‌వానికి వినాయ‌క చ‌వితి పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్త‌వానికి వేకువ జామునే నిద్ర లేచి రోజు చేసుకొనే నిత్య దేవ‌తారాధ‌న ముందు పూర్తి చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఇంటిల్లిపాది క‌లిసి పాల‌వెల్లి ని అలంక‌రించి, పూజా మందిరాన్ని అలంక‌రించుకొని పూజ‌కు సిద్ద ప‌డాలి. పూజ కోసం వినాయ‌క ప్ర‌తిమ‌ను తెచ్చి పెట్టుకోవ‌టం ఆన‌వాయితీ. ఆ త‌ర్వాత వినాయ‌కుడికి పూజ చేసి నైవేద్యాలు చెల్లించ‌టం ఆన‌వాయితీ. గ‌ణ‌ప‌తి పూజ‌లో ప‌విత్రంగా భావించే ప‌త్రి పూజ‌ను ఆచ‌రిస్తారు.

ఇంటి బ‌య‌ట ఉండే కూడ‌ళ్ల లో, సంస్థ ల్లో, కంపెనీల్లో వినాయ‌కుడ్ని నిలిపి పూజ‌లు చేయ‌టం ఆన‌వాయితీ. సాధార‌ణంగా ఎవ‌రికి వారు ఇళ్ల ద‌గ్గ‌ర పూజ‌లు చేసుకొని విధుల‌కు హాజ‌ర‌య్యాక‌, మ‌ధ్యాహ్న స‌మ‌యంలో లేదా సాయంత్రం స‌మ‌యంలో ఈ సామూహిక పూజ‌లు చేస్తారు. ఈ సారి మ‌ధ్యాహ్న‌మే చ‌వితి వెళ్లి పోతోంది కాబ‌ట్టి ఎలా అనే సందేహం వ్య‌క్తం అయింది. వాస్త‌వానికి ప్ర‌తీ రోజూ తిథి పూర్తిగా ఉండ‌టం జ‌ర‌గ‌క పోవ‌చ్చు. అటువంట‌ప్పుడు సూర్యోదయ స‌మ‌యంలో ఉన్న తిథినే ఆ రోజు తిథిగా భావిస్తారు. అందుచేత సూర్యోద‌య స‌మ‌యంలో ఉన్న తిథిని ఆధారంగా చేసుకొని ఆ రోజుకి సంబంధించిన కార్య‌క‌లాపాలు నిర్ణ‌యించుకొంటారు. అందుచేత ఈ ప్రాతిప‌దిక‌నే ఇవాళ వినాయ‌క చ‌వితి పాటించ‌టం జ‌రుగుతోంది.అందుచేత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో వినాయ‌కుడ్ని పూజించి గ‌ణేశుడి ఆశీస్సులు అందుకోవ‌టం ఆన‌వాయితీ.